జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల.. రాష్ట్రంలో టాపర్స్ వీరే..

206
- Advertisement -

ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు నిర్వహించిన తొలి విడత జేఈఈ మెయిన్‌ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐలలో ప్రవేశాల కోసం పరీక్షల నిర్వహణ జరిగింది. ఈ మేరకు తొలిసారి మెయిన్‌ స్కోరును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. జేఈఈ మెయిన్‌ బాలికల విభాగంలో రాష్ట్రానికి చెందిన కే శరణ్య 99.99 పర్సంటైల్‌ సాధించి దేశంలోనే టాపర్‌గా నిలిచింది. 99.99 పర్సంటైల్‌తో చల్లా విశ్వనాథ్‌ తెలంగాణ టాపర్‌గా నిలిచాడు. ఎస్టీ కోటాలో టాప్‌-3 స్థానాలను తెలంగాణ విద్యార్థులే కైవసం చేసుకొన్నారు. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకుగాను ఫిబ్రవరిలో నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పేపర్‌-1(బీఈ, బీటెట్‌) పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఆరుగురు 100 పర్సంటైల్‌ సాధించగా అందరూ అబ్బాయిలే. ఈమేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ఫలితాలను ప్రకటించారు.

ఫలితాలను ఎన్టీఏ సోమవారం రాత్రి తమ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. పరీక్షకు 6.52 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 6.20 లక్షల మంది హాజరయ్యారు. వాస్తవానికి ఫలితాలు ఆదివారమే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. ఫలితాల విడుదలలో అనిశ్చితి, ఎన్టీఏ అలసత్వంపై విమర్శలు వస్తున్నాయి. గతేడాది కూడా అర్ధరాత్రి ఫలితాలను ప్రకటించారు. సాకేత్‌ ఝా (రాజస్థాన్‌), ప్రవార్‌ కఠారియా, రంజిమ్‌ ప్రభల్‌ దాస్‌ (ఢిల్లీ), గురమృత్‌ సింగ్‌ (చండీగఢ్‌), సిద్ధాంత్‌ ముఖర్జీ (మహారాష్ట్ర), ఆనంద్‌ కృష్ణ కిదాంబి (గుజరాత్‌) 100 పర్సంటైల్‌ సాధించారు. తెలంగాణ, ఏపీ నుంచి ఒక్కరు కూడా 100 పర్సంటైల్‌ సాధించలేదు. గతేడాది జేఈఈ మెయిన్‌లో 24 మంది 100 పర్సంటైల్‌ సాధించారు. ఈ ఏడాది కేవలం ఆరుగురికే 100 పర్సంటైల్‌ వచ్చింది.

తెలంగాణ విద్యార్థుల ఫలితాలు..

చల్లా విశ్వనాథ్‌- 99.99 పర్సంటైల్‌(టాపర్‌గా తెలంగాణ టాపర్‌)
కే శరణ్య – 99.99 పర్సంటైల్‌(మహిళా కోటాలో జాతీయ స్థాయి టాపర్‌)
ఇస్లావత్‌ నితిన్‌ – 99.99, బిజిలి ప్రచోతన్‌ వర్మ- 99.98, నేనావత్‌ ప్రీతమ్‌- 99.97 పర్సంటైల్‌తో ఎస్టీ కోటాలో జాతీయ టాపర్లుగా నిలిచారు.
అమేయ విక్రమసింగ్‌ – 99. 99 పర్సంటైల్‌తో (అబ్బాయిల కోటాలో జాతీయస్థాయిలో 8వ ర్యాంక్‌)
అంచ ప్రణవి – 99.99, రామస్వామి సంతోష్‌రెడ్డి – 99.99 పర్సంటైల్‌తో జనరల్‌ (ఈడబ్యూఎస్‌ కోటా)లో ఉత్తమం.

- Advertisement -