జూనియర్ ఎన్టీఆర్, బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జై లవకుశ. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తుండగా సినిమా సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. రావణుడు వచ్చాడు అంటూ విడుదల చేసిన టీజర్తో ఎన్టీఆర్ సినిమా రేంజ్ని అమాంతం పెంచేశాడు. ఇందులో ఎన్టీఆర్ మెస్మరైజింగ్ లుక్ తో ఫ్యాన్స్ ఆనందాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్ళాడు. ఇటీవలే ఈ సినిమా నుంచి ‘లవ’ ఫస్టులుక్ ను కూడా రిలీజ్ చేశారు. లవర్ బాయ్గా కనిపించిన లవ ఫస్ట్ లుక్కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక వినాయక చవితి కానుకగా లవ టీజర్ని విడుదల చేయనుంది చిత్రయూనిట్. మొదటి టీజర్ కి మించి రెండవ టీజర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు.
అంతేకాదు సెప్టెంబర్ 3వ తేదీన ఆడియో వేడుకను నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా రాజమౌళి రానున్నారని… ఆయన చేతుల మీదుగా ఆడియో రిలీజ్ జరగనుందని అంటున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయనే టాక్ రావడంతో, అంతా ఆడియో రిలీజ్ పై దృష్టి పెట్టారు. మూడు విలక్షణమైన పాత్రల్లో .. ముగ్గురు కథానాయికలతో ఎన్టీఆర్ చేసే సందడి కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
లవ టీజర్ విడుదల చేసిన తర్వాత పెద్ద గ్యాప్ లేకుండానే ‘కుశ’ పాత్రకి సంబంధించిన ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ‘లవ’ టీజర్ తో .. ‘కుశ’ ఫస్టులుక్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగడం ఖాయమన్న మాట. ఎన్టీఆర్ సరసన రాశిఖన్నా, నివేదా థామస్, నందితా రాజ్ కథానాయికలుగా నటిస్తోన్నారు. బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో స్వయంగా నిర్మిస్తున్నారు.