మామపై పోటీకి సై అంటున్న అల్లుడు..!

215
satyanarayana krishank
- Advertisement -

తెలంగాణలో ఓ వైపు నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతుండగా కాంగ్రెస్‌లో సీట్ల కేటాయింపు తలనొప్పిగా మారింది. అసంతృప్తుల నిరసనలతో ఇప్పటికే గాంధీభవన్‌కు తాళం వేసిన హస్తం నేతలకు రెబల్ అభ్యర్థుల పోటు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై రెబల్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు ఆయన అల్లుడు ఓయూ నేత క్రిశాంక్.

తొలి జాబితాలో కంటోన్మెంట్‌ టికెట్ దక్కకపోవడంపై హైదరాబాద్ లోని గాంధీ భవన్ వద్ద ఆయన నిరసన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ రెబెల్‌ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని పీసీసీ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌ పేర్కొన్నారు. ఎన్నికల్లో మూడుసార్లు ఓడిపోయిన సర్వేకు కంటోన్మెంట్‌ టికెట్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఓ దళితుడే మరో దళితుడిని అణచివేస్తున్నారని తన మామను ఉద్దేశించి క్రిశాంక్‌ వ్యాఖ్యానించారు.

యువత రాజకీయాలు చేయాలంటే వారికి గాడ్ ఫాదర్ కావాలన్న విషయం తనకు అర్థమైందని, గాడ్ ఫాదర్ లేని వారికి ఎటువంటి అవకాశాలు రావని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఓయూ విద్యార్థికీ అవకాశం లభించకపోవడం బాధాకరమన్నారు. కంటోన్మెంట్‌ టికెట్‌ ఇవ్వమంటే పెద్దపల్లి ఎంపీగా పోటీ చేయమంటున్నారని, అక్కడికెళ్లడం తనకు ఇష్టంలేదన్నారు.

- Advertisement -