కొత్త రూ. 50 నోటు వచ్చేస్తోందా ?

175
- Advertisement -

గత సంవత్సరం నవంబర్ లో రూ.1000, రూ.500 నోట్లని రద్దు చేసి కొత్తగా రూ.2000, రూ.500 నోట్లని ప్రవేశపెట్టింది రిజర్వు బ్యాంకు. అప్పటినుంచి ప్రజలకు నోట్ల కష్టాలు మొదలయ్యాయి. రూ.1000 నోటును కూడా తీసుకొస్తుందన్న వూహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అలాంటి ప్రతిపాదనేదీ లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌ ఇది వరకే తెలిపారు. మరోవైపు కొత్తగా రూ.50, రూ.20 నోట్లను కూడా తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో కొత్త రూ.50 నోటుకు సంబంధించిన చిత్రాలు తాజాగా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం ఉన్న నోట్లతో పోలిస్తే పూర్తి వ్యత్యాసం కనిపిస్తోంది. మహాత్మగాంధీ సిరీస్‌ -2005లో వస్తున్న ఈ నోటు వెనుక భాగంలో ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సంతకం ఉండనుందని ఇది వరకే ఆర్‌బీఐ వెల్లడించింది. ప్రస్తుతం తీసుకొస్తున్న నోటు వెనక భాగంలో దక్షిణ భారతానికి చెందిన ఓ ఆలయం చిత్రం ఉంటుందని సమాచారం. ఇప్పటివరకు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనైతే రాలేదు.

మరోవైపు కరెన్సీ కొరత, చిల్లర సమస్యను అధిగమించేందుకు వీలుగా కొత్తగా అడ్వాన్సు హై సెక్యూరిటీ ఫీచర్లతో రూ.200నోటును ముద్రిస్తోందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. . నకిలీవి సృష్టించడానికి వీల్లేని విధంగా రూ.200 నోట్లలో అదనపు భద్రత ప్రమాణాలు చేర్చారు. రూ.100, రూ.500 మధ్య ఇలాంటి నోటు రావడం వల్ల రోజువారీ నగదు పనులు సులభమవుతాయని బ్యాంకుల అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -