పొత్తు లేనట్లే.. బీజేపీ తేల్చేసిందా ?

14
- Advertisement -

టీడీపీ జనసేన కూటమితో బీజేపీ పొత్తు లేనట్లేనా ? టీడీపీకి దూరంగా ఉండేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందా ? తాజాగా విడుదలైన తొలి జాబితాతో వచ్చిన క్లారిటీ ఏంటి ? అనే ప్రశ్నలు ఏపీ రాజకీయాల్లో తెగ చర్చనీయాంశం అవుతున్నాయి. 2014 పరిస్థితులను రిపీట్ చేయాలని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి కోసం చంద్రబాబు గట్టిగానే ప్రయత్నించారు. అయితే జనసేన పార్టీ టీడీపీతో కలిసినప్పటికి బీజేపీ మాత్రం వెనకడుగు వేస్తూ వచ్చింది. దాంతో బీజేపీని ఎలాగైనా దగ్గర చేసుకునేందుకు పార్టీ పెద్దలతో చంద్రబాబు, పవన్ గత కొన్ని రోజులుగా చర్చలు జరుపుతున్నారు. అయినప్పటికి పొత్తు విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇక చేసేదేమీ లేక అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు పవన్ చంద్రబాబు. తొలి జాబితాలో భాగంగా 94 స్థానాలు టీడీపీ, 24 స్థానల్లో జనసేన సీట్ల ప్రకటన జరిగింది. అయితే బీజేపీతో కేటాయించే సీట్ల విషయంలో అటు పవన్ గాని ఇటు చంద్రబాబు గాని ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

బీజేపీ వస్తే తమతో కలుపుకుంటామని చెబుతున్నప్పటికి కమలం పార్టీ కూడా కచ్చితంగా కలుస్తుందని క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో బీజేపీతో పొత్తు ఉన్నట్లా లేనట్లా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా టీడీపీ జనసేన కూటమి ప్రకటించిన తొలి జాబితాపై బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు మాట్లాడుతూ ఆ రెండు పార్టీల అభ్యర్థుల ప్రకటనపై స్పందించాల్సిన అవసరం లేదని ప్రస్తుతం తమ ఫోకస్ పార్టీని బలోపేతం చేయడంపైనే ఉందని చెప్పుకొచ్చారు. హైకమాండ్ సూచనల మేరకే తమ నిర్ణయాలు ఉంటాయని జీవీఎస్ చెప్పుకొచ్చారు.

అయితే ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన విషయంలో కూడా ఆయన ఎలాంటి వ్యాఖ్యాలు చేయకపోవడం గమనార్హం. మొదటి నుంచి కూడా జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని చెబుతూ వచ్చిన రాష్ట్ర కమలనేతలు ఇప్పుడు జనసేన విషయంలో కూడా స్పందించకపోవడంతో టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలవడం కష్టమే అనే వాదన వినిపిస్తోంది. మరి ఏపీలో బీజేపీ ఏం చేయబోతుంది ? సింగిల్ గా బరిలోకి దిగుతుందా ? లేదా అనూహ్యంగా టీడీపీ జనసేనతో కలుస్తుందా ? అనే దానిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Also Read:TDP :నో టికెట్.. షాక్ లో సీనియర్స్!

- Advertisement -