సంవత్సరంలో డబ్బును రెట్టింపు చేస్తామని నమ్మించి, చిట్ ఫండ్ పథకాల పేరుతో 39 మంది పెట్టుబడిదారుల నుంచి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు రూ. 20.34 కోట్లు కాజేసిన సంఘటన మహారాష్ట్రలోని శిరూర్ తాలూకాలో వెలుగు చూసింది.
2020 నుండి నవంబర్ 2024 మధ్య కాలంలో నిందితులు పెట్టుబడిదారుల నుండి డబ్బు సేకరించారు. కేవలం ఏడాది వ్యవధిలోనే డబ్బులు రెట్టింపు అవుతాయని వారు నమ్మించారు. పూణే మున్సిపల్ కార్పొరేషన్ (PMC) స్కూల్ టీచర్ మరియు ఆయన భార్య ఈ పథకాల్లో నమ్మి రూ. 75.4 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఇందులో రూ. 42.6 లక్షలు ఆన్లైన్ ద్వారా, మిగిలిన రూ. 32.8 లక్షలు నగదు రూపంలో చెల్లించారు.
నవంబర్ 2024లో ఈ చిట్ ఫండ్ పథకాలు నిలిచిపోయినట్లు సదరు టీచర్కు తెలిసింది. తమ డబ్బును తిరిగి ఇవ్వాలని కోరినప్పటికీ నిందితులు నిరాకరించారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, తనలాగే మరో 38 మంది బాధితులు ఉన్నారని, మొత్తం రూ. 20.34 కోట్ల మేర మోసం జరిగిందని తెలిసింది.
బాధితుల ఫిర్యాదు మేరకు రంజన్గావ్ MIDC పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులపై ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (నిషేధ) చట్టం, మహారాష్ట్ర డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణ చట్టం మరియు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పరిమితికి మించిన అధిక రాబడులు లేదా గ్యారెంటీగా డబ్బును రెట్టింపు చేస్తామని చెప్పే పథకాల పట్ల పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి ఆర్థిక సంస్థల్లోనైనా డబ్బులు డిపాజిట్ చేసే ముందు వాటికి సంబంధిత అనుమతులు ఉన్నాయో లేదో సరిచూసుకోవడం శ్రేయస్కరం.
Also Read:హార్ముజ్..అమెరికా భూభాగమే!

