భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో వస్తుందని సూచించారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. మోదీపై నాకు గౌరవం ఉంది అన్నారు ట్రంప్. భారత్తో తమకు అద్భుతమైన బంధం ఉందన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై గౌరవం ఉందని చెప్పారు. అలాగే, భారత్–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో కుదరబోతోందని పేర్కొన్నారు. దక్షిణ కొరియాలోని గ్యోంగ్జూలో జరిగిన APEC CEOల మధ్యాహ్న భోజన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, భారత్–పాకిస్తాన్ కాల్పుల విరమణను తానే సాధించానని ఆయన మరోసారి వ్యాఖ్యానించారు.
తాను ప్రధాని మోదీకి ఫోన్ చేసి, మీరు పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నంత వరకు వాణిజ్య ఒప్పందం చేయలేమని చెప్పాను. తర్వాత పాకిస్తాన్కి కూడా అదే చెప్పాను,” అని తెలిపారు. ఈ ఏడాది మేలో జరిగిన స్వల్ప ఘర్షణ తర్వాత భారత్–పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించానని ట్రంప్ ఇంతకు ముందూ చెప్పిన విషయం తెలిసిందే. అయితే, న్యూఢిల్లీ ఈ వాదనను వరుసగా ఖండిస్తూ, కాల్పుల విరమణ ద్వైపాక్షికంగా కుదిరిందని స్పష్టం చేసింది.
గత వారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారత్ ఎలాంటి ఒత్తిడిలోనూ లేదా త్వరితగతిన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోదని అన్నారు. ప్రస్తుతం భారత్ యూరోపియన్ యూనియన్, అమెరికా వంటి అనేక దేశాలు మరియు బ్లాకులతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని చెప్పారు.
Also Read:జూబ్లీహిల్స్..కేటీఆర్ రోడ్ షో షెడ్యూల్
రష్యా నుండి చమురు కొనుగోలు చేసినందుకు శిక్షార్ధంగా అమెరికా భారత్పై 25 శాతం సుంకం విధించింది. అదనంగా, అమెరికా మార్కెట్లోకి ప్రవేశించే భారతీయ వస్తువులపై ఇప్పటికే 25 శాతం పరస్పర సుంకం ఉంది. అంటే ప్రస్తుతం భారత ఎగుమతులపై సుమారు 50 శాతం అదనపు దిగుమతి సుంకం పడుతోంది.

