రెండో టీ20లో భారత్ విజయం..

57
- Advertisement -

కోల్ కతా వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా దుమ్మురేపింది. ఆస‌క్తిక‌రంగా సాగిన ఈ మ్యాచ్‌లో భార‌త్ 8 ప‌రుగుల తేడాతో విజయ సాధించింది. భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన వెస్టిండీస్ 3 వికెట్ల న‌ష్టానికి 178 ప‌రుగులు చేసింది. వికెట్ కీపర్ నికోలస్ పూరన్, రోవ్‌మన్ పావెల్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరూ ఎడాపెడా బంతులను బౌండరీలకు తరలిస్తూ లక్ష్యం దిశగా దూసుకెళ్లారు.

పూరన్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేయగా, పావెల్ 36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు చేశారు. వీరి దూకుడు చూస్తుంటే భారత్ ఓటమి ఖాయమని అనిపించింది. అయితే, 19వ ఓవర్ మూడో బంతికి పూరన్‌ను భువనేశ్వర్ అవుట్ చేయడంతో విజయం విండీస్ చేజారింది. ఆ తర్వాత కెప్టెన్ పొలార్డ్ క్రీజులోకి వచ్చినప్పటికీ పరుగులు రాబట్టలేకపోయాడు. ఫలితంగా 178 పరుగుల వద్ద విండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా రోహిత్ సేన 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. మాజీ సారథి కోహ్లీ, రిషభ్ పంత్ అర్ధ సెంచరీలతో రాణించారు. ముఖ్యంగా కోహ్లీ మునుపటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 41 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 52 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. పంత్ కూడా చెలరేగిపోయాడు. మెరుపు అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

28 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 52 పరుగులు చేయగా, వెంకటేశ్ అయ్యర్ కూడా క్రీజులో ఉన్నంత సేపు బ్యాట్ ఝళిపించాడు. 18 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 33 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 19 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ (2), సూర్యకుమార్ యాదవ్ (8) దారుణంగా విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ 3 వికెట్లు పడగొట్టగా, కాట్రెల్, రొమరియో చెరో వికెట్ తీసుకున్నారు. రిషభ్ పంత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చివరి టీ20 రేపు (ఆదివారం) జరుగుతుంది.

- Advertisement -