భారత్-అమెరికా ట్రేడ్ డీల్..కీలక అంశాలు

3
- Advertisement -

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం: ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఇది భారత వ్యాపారులు, రైతులకు మరిన్ని అవకాశాలు కల్పించడంతో పాటు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ప్రకటించిన కొన్ని రోజుల తరువాత, శనివారం భారత్ మరియు అమెరికా (US) ఈ ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్ సిద్ధమైందని అధికారికంగా వెల్లడించాయి. ఈ ఒప్పందం ప్రకారం, అమెరికా భారత ఉత్పత్తులపై విధిస్తున్న టారిఫ్‌లను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించనుంది. అదే సమయంలో, న్యూఢిల్లీ అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని ఉత్పత్తులపై ఉన్న సుంకాలను పూర్తిగా రద్దు చేయడం లేదా సున్నాకు తగ్గించడంకు అంగీకరించింది.

సంయుక్త ప్రకటనలో, ఇరు దేశాలు ఇప్పటికే అంగీకరించిన రోడ్‌మ్యాప్‌కు అనుగుణంగా పరస్పర లాభదాయక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)ను పూర్తి చేయడంపై పని చేస్తామని తెలిపాయి.

ఒప్పందంలోని ముఖ్య అంశాలు:

భారత్ అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని పారిశ్రామిక ఉత్పత్తులు, అలాగే అనేక ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్‌లను రద్దు చేయడం లేదా తగ్గించనుంది. ఇందులో DDGs, పశువుల మేతకు ఎర్ర జొన్నలు, డ్రై ఫ్రూట్స్, తాజా మరియు ప్రాసెస్ చేసిన పండ్లు, సోయాబీన్ ఆయిల్, వైన్, మద్యం తదితరాలు ఉన్నాయి.

అమెరికా, 2025 ఏప్రిల్ 2న జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం, భారత ఉత్పత్తులపై 18 శాతం పరస్పర టారిఫ్ అమలు చేస్తుంది. ఇందులో టెక్స్టైల్స్, లెదర్, ఫుట్‌వేర్, ప్లాస్టిక్, రబ్బర్, ఆర్గానిక్ కెమికల్స్, హోమ్ డెకోర్, హస్తకళా ఉత్పత్తులు, కొన్ని యంత్రాలు ఉన్నాయి.

మధ్యంతర ఒప్పందం విజయవంతంగా పూర్తైతే, ఔషధాలు, వజ్రాలు, విమాన భాగాలపై టారిఫ్‌లు తొలగిస్తారు.

విమానాలు, విమాన భాగాలు, అల్యూమినియం, స్టీల్, కాపర్‌పై జాతీయ భద్రత కారణంగా విధించిన టారిఫ్‌లను అమెరికా తొలగిస్తుంది.

ఆటోమొబైల్ భాగాలపై భారత్‌కు ప్రాధాన్యత కలిగిన టారిఫ్ కోటా ఇవ్వబడుతుంది.

ఇరు దేశాలు పరస్పరం ప్రాధాన్య మార్కెట్ యాక్సెస్ కల్పించుకుంటాయి.

వాణిజ్యానికి అడ్డుగా ఉన్న నాన్-టారిఫ్ అడ్డంకులను తొలగించేందుకు అంగీకారం కుదిరింది.

డిజిటల్ ట్రేడ్‌లో వివక్షతను తొలగించి, బలమైన నిబంధనలను రూపొందించేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయి.

Also Read:TTD:మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవం

రాబోయే 5 సంవత్సరాల్లో భారత్ 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఎనర్జీ ఉత్పత్తులు, విమానాలు, సాంకేతిక ఉత్పత్తులు, కోకింగ్ కోల్ కొనుగోలు చేయనుంది.

టెక్నాలజీ రంగంలో, ముఖ్యంగా GPUలు, డేటా సెంటర్ ఉత్పత్తులపై వాణిజ్యాన్ని గణనీయంగా పెంచనున్నారు.

- Advertisement -