USA క్రికెట్ టీం సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది ఐసీసీ. ఐసీసీ పాలసీలను అమలు చేయడంలో, నిర్వహణలో USA క్రికెట్ బోర్డ్ విఫలమైందని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
గత ఏడాది నుంచి వ్యవహారాలను సమగ్రంగా సమీక్షించడం, కీలక వాటాదారులతో విస్తృతంగా సంప్రదింపులు జరపడం అనంతరం, అమెరికా క్రికెట్ సభ్యత్వ హోదాను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ఐసీసీ ధృవీకరించింది. ఈ నిర్ణయం ఇటీవల జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో తీసుకున్నారు. అమెరికా క్రికెట్ బోర్డు ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించిందని బోర్డు తేల్చింది.
ఐసీసీ ప్రకారం ..సమర్థవంతమైన పాలనా వ్యవస్థను అమలు చేయడంలో వైఫల్యం చెందడం, యునైటెడ్ స్టేట్స్ ఒలింపిక్ మరియు పారా ఒలింపిక్ కమిటీ (USOPC) ద్వారా జాతీయ గవర్నింగ్ బాడీ హోదా పొందడంలో పురోగతి లేకపోవడం, అమెరికా మరియు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రతిష్టను దెబ్బతీయగల చర్యలు చేపట్టడం, ఏసీఈ (ACE)తో ఒప్పందం రద్దు వంటి అంశాలను వెల్లడించింది.
ఈ పరిణామం, అమెరికా క్రికెట్ అమెరికన్ క్రికెట్ ఎంటర్ప్రైజెస్ (ACE)తో కుదుర్చుకున్న 50 ఏళ్ల వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసిన కొద్ది రోజుల తర్వాత చోటు చేసుకుంది. 2019లో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం, ఎలైట్ T20 క్రికెట్పై నియంత్రణ ఇచ్చి, ప్రతిఫలంగా జాతీయ జట్లకు నిధులు, ఆరు స్టేడియంల నిర్మాణం, లీగ్ల ప్రారంభం వంటి పనులను ఏసీఈ చేయాల్సి ఉంది. కానీ ఏసీఈ చేయలేదు.
Also Read:తాల్ హెల్త్ఫెస్ట్ 2025కు అతిథిగా కేటీఆర్
అయితే సస్పెన్షన్ ఉన్న అమెరికా జాతీయ జట్టు.. ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనే హక్కు ఉంటుంది. లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్ (LA28) సన్నాహాల్లోనూ కొనసాగుతాయి.అమెరికా క్రికెట్ సభ్యత్వాన్ని పునరుద్ధరించడానికి –పాలన, కార్యకలాపాలు, క్రికెట్ వాతావరణంలో తన స్థితిని మెరుగుపరచడం వంటి ప్రత్యేక షరతులు విధించనున్నారు.ఐసీసీ నార్మలైజేషన్ కమిటీ, ఐసీసీ మేనేజ్మెంట్ సహకారంతో పర్యవేక్షణ, సలహాలు అందిస్తుంది.

