రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ అంటూ ఫేక్ జీవోను నాలుగు రోజుల క్రితం సోషల్ మీడియాలో విడుదల చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఫేక్ జీవో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు.. రాత్రిపూట లాక్డౌన్ జీవో అంటూ రిలీజ్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.
అరెస్ట్ చేసిన వ్యక్తిని నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీపతి సంజయ్ కుమార్గా గుర్తించారు. హైదరాబాదులో చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి…. నిందితుడిని పట్టుకున్నట్టు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.
ఎవరైనా ప్రభుత్వ జీవోను నకిలీవి తయారు చేసిన పక్షంలో చర్యలను తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇలాంటి ఫేక్ జీవోను సర్క్యులేట్ చేయడం ద్వారా ప్రజలు కంగారుపడే అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చేవి నిజమా కాదా అని నిర్ధారించుకున్న తరువాతనే ఫార్వార్డ్ చేయాలని ప్రజలకు సూచించారు. ఇలాంటి తప్పుడు వార్తలను షేర్ చేయకూడదని కోరారు. కేవలం తమాషా కోసమే ఈ పనిచేశానని సంజయ్ కుమార్ వెల్లడించడం విశేషం.

