టీటీడీకి పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి. హైదరాబాద్ కు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి స్వర్గీయ వై.వి.ఎస్.ఎస్. భాస్కర్ రావు తన మరణానంతరం వీలునామా ద్వారా టీటీడీకి రూ.3 కోట్ల విలువైన నివాస గృహంతో పాటు తన బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న రూ.66 లక్షలను విరాళంగా అందించి అచంచలమైన భక్తిని చాటుకున్నారు.
హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతంలో ఉన్న “ఆనంద నిలయం” అనే 3,500 చదరపు అడుగులు గల భవనాన్ని, ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఆయన టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్లు వీలునామాలో పేర్కొన్నారు.
అలాగే హైదరాబాద్ కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.2 కోట్లు (వేర్వేరు చెక్కుల రూపంలో) విరాళంగా అందించింది. తిరుపతికి చెందిన ఎల్వీ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ పి.సి.రాయల్ గురువారం శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. బెంగుళూరుకు చెందిన శ్రీ సుకుమార్ అనే భక్తుడు శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని (స్విమ్స్) పథకానికి రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీడీపీ డిప్యూటీ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి దాతలను అభినందించారు.
Also Read:నారా రోహిత్.. బర్త్ డే స్పెషల్

