తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద తిరుపతిలో రికార్డు సమయంలో నిర్మించిన శ్రీనివాససేతు ఫ్లైఓవర్ను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా తిరుపతిలోని మామిడికాయల మండీ వద్ద జరిగిన శ్రీనివాస సేతు ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రివర్యులు మాట్లాడుతూ రూ.650.50 కోట్లతో 7 కిలోమీటర్ల మేర నిర్మించిన ఫ్లై ఓవర్ తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి ఆభరణం లాంటిదన్నారు. ఇది ఇంజినీరింగ్ అద్భుతమని, దీని వల్ల ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని, యాత్రికులు సులభంగా తిరుమలకు చేరుకోగలగుతారని చెప్పారు.తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో 37.80 కోట్ల రూపాయలతో టీటీడీ నిర్మించిన రెండు హాస్టల్ బ్లాకులను సోమవారం ముఖ్యమంత్రివర్యులు వర్చువల్గా ప్రారంభించారు. హాస్టల్ బ్లాకుల్లో మొత్తం 181 గదులు ఉన్నాయి. ఇందులో 750 మంది విద్యార్థులు బస చేయవచ్చు.
టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల పంపిణీ సందర్భంగా ముఖ్యమంత్రివర్యులు మాట్లాడుతూ వడమాలపేట మండలం పాదిరేడు గ్రామ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం 300 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయించడం టీటీడీ చరిత్రలో ఒక మహత్తర ఘట్టమన్నారు. మొత్తం 6700 మంది టీటీడీ ఉద్యోగులు ఉండగా ప్రస్తుతం రూ.313 కోట్ల వ్యయంతో 3,518 మందికి ఇంటిస్థల పట్టాలు పంపిణీ చేస్తున్నామని, రూ.280 కోట్ల వ్యయంతో మిగిలిన ఉద్యోగులకు కూడా 30 నుండి 45 రోజుల వ్యవధిలో ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రివర్యులు హామీ ఇచ్చారు. అనంతరం కొంతమంది ఉద్యోగులకు ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారు.
అంతకుముందు తిరుపతి శాసనసభ్యులు, టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో గతంలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్లస్థలాలు మంజూరయ్యాయని, తిరిగి వారి కుమారుడు ముఖ్యమంత్రివర్యులు వైఎస్.జగన్మోహన్రెడ్డి హయాంలోనే ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయని తెలిపారు. తండ్రీ కొడుకుల హయాంలో టీటీడీ బోర్డు ఛైర్మన్గా పని చేయడం తన అదృష్టమన్నారు. టీటీడీ ఉద్యోగుల దశాబ్దాల కలను సాకారం చేసినందుకు ముఖ్యమంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read:KTR:తెలంగాణపై విషం చిమ్ముతున్న మోడీ
సమావేశం ప్రారంభంలో ఈ మూడు కార్యక్రమాలకు సంబంధించి ఆడియో విజువల్ను ప్రదర్శించారు.ప్రాచీన సంప్రదాయాన్ని పాటిస్తూ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం తిరుమలకు బయలుదేరే ముందు తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని పూజలు నిర్వహించారు.గంగమ్మను శ్రీవేంకటేశ్వరుని సోదరిగా పురాణాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర సందర్భంగా తిరుమల శ్రీవారు సంప్రదాయంగా సారె పంపుతారు.
Also Read:మహేష్ సినిమాలో కూడా అదే స్ట్రాటజీ?