ఇది గాలిమేడల బడ్జెట్..అంకెల గారడీ తప్ప ప్రజలకు వచ్చేది ఏమి లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. శాసనసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు..గత బడ్జెట్ను ఈ బడ్జెట్ను పరిశీలిస్తే అంతా అబద్దమని తేలిపోతుందన్నారు.
కాంగ్రెస్ వైఫల్యం వల్ల రాష్ట్ర ఆదాయంపై ప్రభావం పడింది. రాష్ట్ర ఆదాయం క్షీణిస్తున్న సమయంలో ఏం చేయాలో భట్టి విక్రమార్క చెప్పాలి. ప్రభుత్వ వైఫల్యాలు సరిచేసుకోవాలి లేదా రేవంత్రెడ్డి ఫార్ములా ప్రకారం భూములు అమ్మాలి. ఎనుముల వారి పాలనలో ఎన్ని భూములు ఖతం పట్టిస్తారో తెలియదు అన్నారు.
ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు, పంటలకు బోనస్ ఇస్తామని మోసం చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, విద్యార్థులకు భరోసా కార్డు పేరుతో మోసం చేశారు. ఆదాయం పెంచి హామీలు నెరవేరుస్తామని ఎన్నికలకు ముందు చెప్పారు. గచ్చిబౌలిలో 400 ఎకరాల భూముని వేలం చేయడం ద్వారా రూ.30 వేల కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. టీజీఐఐసీ భూములు తాకట్టుపెట్టి రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చారు.
హెచ్ఎండీఏ భూములు తాకట్టుపెట్టి రూ.20 వేల కోట్లు అప్పు తెస్తామని చెప్పారు. ఆ రోజు ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తుంటే ఆ రోజు అక్కడ భట్టి విక్రమార్క, సీతక్క పాదయాత్ర చేసి భూములు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఇప్పుడేమో ఇంకా 14 వేల ఎకరాలు లాక్కుంటాం అంటున్నారని విమర్శించారు. ఆ రోజు మేము ప్రభుత్వ భూములు అమ్మితే ప్రభుత్వ భూముల ఎలా అమ్ముతారన్నారు. ఈరోజు బరాబర్ భూములు అమ్ముతాం అంటున్నారని హరీశ్రావు చెప్పారు.
Also Read:పదో తరగతి పరీక్షలు..కేటీఆర్ కీలక సూచన