ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్రావుపై జరిగిన సిట్ విచారణ సోమవారం ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో సిట్ అధికారులు ఆయనను దాదాపు ఏడుగంటలకు పైగా ప్రశ్నించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 6.30 గంటల వరకు కొనసాగింది. విచారణ అనంతరం హరీష్రావు తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ కేసులో విచారణకు హాజరుకావాలని శనివారం సాయంత్రం సిట్ అధికారులు హరీష్రావుకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల మేరకు ఆయన సోమవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ సిట్ అధికారులు పలు అంశాలపై సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు సమాచారం.
విచారణ సమయంలో హరీష్రావుతో పాటు ఆయన న్యాయవాదులను లోపలికి అనుమతించకపోవడం వివాదానికి దారి తీసింది. దీనిపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీస్స్టేషన్ వెలుపల నినాదాలు చేశారు. దీంతో అక్కడి పరిస్థితి కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
హరీష్రావును సిట్ అధికారులైన ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్రెడ్డి విచారించారు. ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన పలు కీలక అంశాలపై వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.
Also Read:‘నారీ నారీ నడుమ మురారి’..ఆనందాన్ని ఇచ్చింది

