సాయి లేని లోటు తీరనిది:హరీష్

6
- Advertisement -

తెలంగాణ మలిదశ ఉద్యమ కళాకారుడు సాయిచంద్‌ రెండో వర్ధంతి సందర్భంగా వనపర్తి జిల్లా అమరచింత కొత్త బస్డాండ్‌ ఆవరణలో క్యాంస విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మంత్రి హరీష్‌ రావు… కాలం గడిచింది కానీ, సాయి గుర్తులు మన మధ్యే మిగిలి ఉన్నాయి… తమ్ముడు సాయిచంద్ అకాల మరణం నన్ను ఎంతో బాధకు గురి చేసింది. వ్యక్తిగతంగా నాకు, మన పార్టీకి సాయి లేని లోటు తీరనిది అన్నారు. కవి, రచయిత, వాగ్గేయ కారుడు, ఉద్యమ కారుడు..సాయి, కేసీఆర్ గారికి, కోట్లాది మందికి, మన పార్టీకి సాయి అంటే ఎంతో ఇష్టం అన్నారు.

కోట్లాది ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు సాయి…ఒక్కో పాట తూటాలా పేలేది. తన ఆట, పాటతో తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించి, ఎంతో మందిలో స్ఫూర్తి రగిలించారు.ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదు.తెలంగాణ ఉద్యమం సందర్భంగా నిర్వహించిన ధూంధాం కార్యక్రమాల్లో సాయిచంద్‌ పాల్గొని సబ్బండ వర్ణాలతో కలిసి కదం తొక్కారు. స్వరాష్ట్ర కాంక్షను ప్రజలకు అర్థమయ్యేలా కళాకారులతో కలిసి ఆడి పాడారు అన్నారు.

‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా..’ అంటూ తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ ప్రాణాలను త్యాగం చేసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఉద్దేశించి పాడిన పాట రాతి గుండెలాంటి మనుషుల్లో కూడా కన్నీళ్లు తెప్పించింది.ఆ పాట ఎన్నిసార్లు విన్నా నా కళ్ళల్లో నీళ్ళు తిరిగేవి.ఉద్వేగభరితమైన పాటతో, ఉత్తేజకరమైన మాటలతో ఉద్యమ సమయంలో లక్షలాది మంది ప్రజలను ఉర్రూతలూగించిన వ్యక్తి సాయి.అమరుల గురించి పాడినా, అంబేద్కర్‌ గీతం ఆలపించినా గుండెను సముద్రంగా మార్చే శక్తి సాయిచంద్‌ సొంతం.తెలంగాణ ఉద్యమ సందర్భంలో జైలు నిర్బంధాలను ఆనందంగా భరించాడు అన్నారు.

లాఠీదెబ్బలు తిన్నాడు. ‘కంఠంపై కత్తిపెట్టి, కణతపై తుపాకీ పెట్టి కడసారిగా పలకమంటే, పలికే చివరిమాట కూడా జై తెలంగాణ’ అంటూ రాజ్యం గుండెలదిరేలా నినదించాడు.ఎన్ని ప్రలోభాలు పెట్టిన కేసీఆర్ వెంట నిలబడ్డాడు తెలంగాణ కోసం కొట్లాడాడు. అసలు సిసలైన ఉద్యమకారుడు సాయిచంద్. జై తెలంగాణ అనని వ్యక్తి ఈ రాష్ట్రానికి సీఎం అయ్యాడంటే ఎంతో బాధపడేవాడు. అలాంటి వ్యక్తి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అని మాట్లాడుతున్నాడు ..కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం అంటే తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేయడం. కేసీఆర్ అంటే ఉద్యమం కేసీఆర్ అంటే అభివృద్ధి కేసీఆర్ అంటే సంక్షేమం ,సాయి బతికి ఉంటే భూమి దద్దరిల్లేలా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసేవాడు ,తన పాటతో తన ఆటతో తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసేవాడు అన్నారు.

బిఆర్ఎస్ రజతోత్సవ సభలో సాయిలేని లోటు కనిపించింది…సాయి విగ్రహాన్ని నా చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్న అంటే నా గుండె బరువెక్కుతున్నది..చిన్న వయసులో సాయి మనందరినీ వదిలి వెళ్లిపోవడం చాలా బాధాకరం ..సిద్దిపేట కోడి కూత సాయిచంద్. సిద్దిపేట ప్రజలు ఇప్పటికీ సాయి పాటతో నిద్ర లేస్తారు.స్వచ్ఛ సిద్దిపేట కోసం సాయి రాసిన పాట ఇప్పటికీ అన్ని ట్రాక్టర్లు, ఆటోలలో మార్మోగుతున్నాయి. దళిత ఉద్యమం, మద్యపాన నిషేధం ఇలా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయి ఎంతో ఉన్నత స్థానాల్లో ఉండాలని కెసిఆర్ గారు భావించారు. కాని విధి వెంటాడింది దురదృష్టవశాత్తు మన మధ్య లేకుండా పోయారు.సాయి ఆశయాలను, సాయి ఆలోచనలను సోదరి రజనీ రూపంలో తప్పకుండా ముందుకు తీసుకెళ్దాం. భర్త లేకున్నా, చిన్నపిల్లలు ఉన్న రజిని చేస్తున్న పోరాటం అభినందనీయం. భర్త ఆశయాలను ముందుకు తీసుకెళుతున్నది…సాయిచంద్ ను ఎంతగా ప్రేమిస్తుందో, ఎంతగా ఆరాదిస్తుందో రజిని పడుతున్న తపన చూస్తే అర్థమవుతుంది.రజిని చేస్తున్న ప్రయత్నానికి బి ఆర్ ఎస్ పార్టీ ఎల్లవేళల సంపూర్ణమైన మద్దతును అందిస్తుంది అన్నారు.ఎక్కడ అధైర్య పడవద్దు, అన్ని రకాలుగా బి.ఆర్.ఎస్ పార్టీ రజనికి, వారి కుటుంబానికి మద్దతుగా ఉంటుంది…సాయిని ఎలా అయితే కుటుంబ సభ్యులు అనుకున్నామో, రజిని కూడా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యురాలు అన్నారు.

చిన్న వయసులో తల్లిని కోల్పోయిన సాయి కష్టాన్ని నమ్ముకున్నాడు. కసితో ఎదిగాడు…కళాకారుడికి ఇంత ప్రేమ దొరికింది అంటే, కోట్లలో ఒకరికి దొరుకుతుంది.గుండెలో ఎంత బాధ ఉన్నా, లక్ష్యం వీడలేదు. నేటి యువత సాయిని ఆదర్శంగా తీసుకోవాలి, సమయం వృధా చేసుకోవద్దు, కష్టాన్ని నమ్ముకోవాలి, పట్టుదలతో పనిచేసి అనుకున్న రంగంలో లక్ష్యాన్ని చేరుకోవాలి. సాయి కి నివాళి అర్పించాలంటే మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి కేసీఆర్ గారు సీఎం కావాలి అని మనందరం సంకల్పించాలి. ..జై తెలంగాణ అనే ప్రభుత్వం పోయి, నై తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. జై తెలంగాణ ప్రభుత్వం వచ్చేందుకు మనందరం కృషి చేయాలి.సాయి చందు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. జోహార్ సాయిచంద్ అన్నారు.

Also Read:సందీప్ రెడ్డి వంగా…’జిగ్రీస్’

- Advertisement -