Harish: హోంగార్డ్‌లు అంటే అంత చులకనా?

1
- Advertisement -

సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో జరిపిన బిల్డింగ్ కూల్చివేతలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న హోంగార్డ్ గోపాల్‌ను పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆసుపత్రికి వెళ్లినవారిలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా ఒక్క పోలీస్ ఉన్నతాధికారి కూడా వచ్చి పరామర్శించలేదు. హోంగార్డ్‌లు అంటే అంత చులకనా? అని ప్రశ్నించారు హరీశ్‌. ఇప్పటి వరకు హోం గార్డ్ గోపాల్ కుటుంబం చికిత్సకి లక్ష రూపాయలు ఖర్చు చేశారు. ప్రభుత్వం వైద్య ఖర్చులు భరించడం లేదు…ప్రభుత్వం నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు అన్నారు.

నాలుగు నెలల నుండి జీతం రాక, ఇటు వైద్య ఖర్చులు భరించలేక పోతున్నాం అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…తలకు దెబ్బ తగిలి మాట పడిపోయింది. పూర్తిగా మాటలు రావడానికి నాలుగు నెలల పాటు స్పీచ్ థెరఫీ అందించాలని డాక్టర్లు చెప్తున్నారు అన్నారు. ప్రమాదకరమైన డిటోనేటర్లతో పేలుళ్ళు చేసినప్పుడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే గోపాల్ ప్రమాదానికి గురి అయ్యారు…ఈ ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేయకుండా గోపాల్‌ని, గోపాల్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. గోపాల్‌కి పూర్తిగా నయం అయ్యేంత వరకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలని, అలాగే గోపాల్‌కి పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని స్పష్టం చేశారు.

Also Read:KTR: హైకోర్టు తిట్టినా ఇండ్లు కూల్చేస్తున్న తుగ్లగ్ రేవంత్..

- Advertisement -