ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 “ఎల్ క్లాసికో” మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేతిలో 103 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన అనంతరం ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించారు. మ్యాచ్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం తమపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన అంగీకరించారు.
పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడం ఎప్పుడూ ఇబ్బందికరమే. ఆరంభంలోనే వికెట్లు పడటంతో మేము మ్యాచ్లో వెనుకబడ్డాం. ఆ తర్వాత మేము కోలుకోలేకపోయాము అని హార్దిక్ పేర్కొన్నారు. పిచ్ ఏమైనా మారిందా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. నేను అలా చెప్పను. పిచ్ ఒకేలా ఉంది, కానీ సీఎస్కే బ్యాటర్లు చాలా బాగా ఆడారు. వారు 207 పరుగులు చేశారు. మేము ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది అని అన్నారు.
సీఎస్కే బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నారని, వారి బ్యాటింగ్ లోతు కారణంగానే వారు భారీ స్కోరు సాధించగలిగారని హార్దిక్ కొనియాడారు. ఐపీఎల్ చరిత్రలోనే పరుగుల పరంగా ముంబై ఇండియన్స్కు ఇది అత్యంత భారీ ఓటమి. ఇంతకుముందు 2013లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 87 పరుగుల తేడాతో ఓడిపోవడమే వారి అత్యంత చెత్త రికార్డుగా ఉండేది.
వాంఖడేలో పరాభవం: తమ సొంత మైదానమైన వాంఖడే స్టేడియంలో కూడా ఇదే అతిపెద్ద ఓటమి. సీఎస్కేకు ఐపీఎల్ చరిత్రలో ఇది అతిపెద్ద విజయం (103 పరుగులు). గతంలో పంజాబ్ కింగ్స్పై సాధించిన 97 పరుగుల విజయమే వారి బెస్ట్ రికార్డు. జట్టులో మార్పుల గురించి ప్రస్తావిస్తూ.. రాబోయే మ్యాచ్ల కోసం టీమ్ మేనేజ్మెంట్తో చర్చించి, ఎక్కడ తప్పులు జరిగాయో విశ్లేషించుకుంటామని హార్దిక్ తెలిపారు.
Also Read:ప్రతిష్టాత్మకంగా భారత్-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్!

