Bhumana:భక్తుల్లో ఆత్మస్థైర్యం నింప‌డానికే చేతిక‌ర్ర‌లు

14
- Advertisement -

అలిపిరి న‌డ‌కమార్గంలో క్రూర‌మృగాల సంచారం నేప‌థ్యంలో అనేక భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని, ఇందులో ఒక చ‌ర్య‌గా భక్తుల్లో ఆత్మస్థైర్యం నింప‌డానికి చేతిక‌ర్ర‌లు అంద‌జేస్తున్నామ‌ని టీటీడీ ధ‌ర‌క్మ‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి తెలిపారు. అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి ఛైర్మ‌న్ బుధ‌వారం భ‌క్తుల‌కు చేతిక‌ర్ర‌ల‌ను అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ చేతిక‌ర్ర‌లతో భ‌క్తులు క్రూర‌మృగాల‌తో పోరాడ‌తార‌ని కాద‌ని, చేతిలో కర్ర ఉంటే ఏ జంతువైనా వెనకాడుతుందని శాస్త్రీయ పరిశీలన ద్వారా రుజువైందని చెప్పారు. వేల సంవత్సరాల నుంచి గ్రామాల్లో ప్ర‌జ‌లు పొలాలకు, అడవులకు వెళ్లేటప్పుడు చేతికర్రలను ఆస‌రాగా తీసుకెళ్లడం జరుగుతోందన్నారు. యాత్రికులకు చేతి కర్రను ఇచ్చి టీటీడీ బాధ్య‌త తీరిన‌ట్టు భావించ‌డం లేద‌ని, భ‌క్తుల‌కు గుంపులుగా పంపుతున్నామ‌ని, వీరికి సెక్యూరిటీ గార్డు భ‌ద్ర‌త‌గా ఉంటార‌ని, అక్కడక్కడ పోలీసు సిబ్బంది కూడా రక్షణగా ఉంటారని తెలియజేశారు. టీటీడీ చేపట్టిన చర్యల్లో భాగంగా అటవీ ప్రాంతంలో బోనులు ఏర్పాటుచేసి ఇప్పటివరకు నాలుగు చిరుతలను బంధించామ‌ని తెలియజేశారు. కర్రల పంపిణీకి సంబంధించి విమర్శలు చేస్తున్న వారిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. చేతిక‌ర్ర‌ల‌ను భ‌క్తుల‌కు ఉచితంగా అందిస్తామ‌ని, వీటిని అలిపిరిలో అంద‌జేసి శ్రీ న‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద తిరిగి తీసుకుంటామ‌ని తెలిపారు.

టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ జులై 2న ఏడో మైలు వ‌ద్ద, ఆగస్టు 12న న‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద జ‌రిగిన ఘటనల నేపథ్యంలో నడక మార్గంలో భక్తుల భద్రత దృష్ట్యా అనేక చర్యలు చేపట్టామన్నారు. 500 కెమెరా ట్రాప్‌లు ఏర్పాటుచేసి నిత్యం అడ‌వి జంతువుల సంచారాన్ని గుర్తించి వాటిని బందిస్తున్నామ‌ని, న‌డ‌క మార్గం వైపు రాకుండా తగిన చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు. భ‌క్తులు సాధు జంతువులు ఆహారం వేయ‌కుండా పండ్ల విక్ర‌యాల‌ను నిలిపివేశామ‌ని, ఈ కార‌ణంగా సాధు జంతువుల కోసం క్రూర‌మృగాలు రావ‌డం లేద‌ని వివ‌రించారు. ప్రస్తుతం తిరుమల శిలాతోరణం వద్ద, ఏడో మైలు వద్ద చిరుతల సంచారాన్ని గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో గాలిగోపురం నుండి వంద మంది భక్తులను గుంపులుగా గోవింద నామస్మరణ చేసుకుంటూ వెళ్లాలని సూచిస్తున్నామని, ప్రతి ఐదు నిమిషాలకోసారి బ్రాడ్ కాస్టింగ్ ద్వారా అటవీ జంతువుల సంచారం, జాగ్రత్తల నుంచి గురించి సమాచారాన్ని తెలియజేస్తున్నామని వివ‌రించారు. భక్తుల భద్రత కోసం అటవీశాఖ ప్రత్యేకంగా వందమంది సిబ్బందిని నియమించుకుంద‌ని, వారు కూడా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు.

Also Read:శ్రీ కృష్ణాష్టమి…విశిష్టత

ప్రస్తుతం 12 ఏళ్ల లోపు పిల్లలను మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్ర‌మే అనుమతిస్తున్నామని, ఘాట్ రోడ్ల‌లో ఉద‌యం 6 నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే ద్విచ‌క్ర వాహ‌నాల‌ను అనుమ‌తిస్తున్నామ‌ని ఈవో తెలియజేశారు. అలిపిరి నడక మార్గం రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందని, ఇక్కడ ఇనుప కంచె వేయడానికి కేంద్ర అటవీ శాఖకు, వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలు పంపామని, వారు త‌గిన డిజైన్ల‌తో అంగీకారం తెలిపితే కంచె నిర్మిస్తామని తెలిపారు. చేతిక‌ర్ర‌ల కోసం అడ‌విని నాశనం చేయడం లేదని, పది వేల కర్రలు మాత్రమే తీసుకున్నామని, ఇందుకోసం రూ.45 వేలు ఖర్చు అయిందని తెలిపారు.

- Advertisement -