నింగిలోకి దూసుకెళ్లిన …. ఇస్రో బాహుబలి

256
GSLV Mk 3: As India Launches Heaviest Rocket
- Advertisement -

భారత్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3డీ1ను శ్రీహరి కోటలోని షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి విజయవంతంగా నింగిలోకి పంపింది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.28 నిమిషాలకు జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగాన్ని ఇస్రో ఛైర్మన్‌ ఎ.ఎస్‌.కిరణ్‌కుమార్‌ దగ్గరుండి పర్యవేక్షించారు. ఇస్రో ఇప్పటి వరకూ ప్రయోగించిన రాకెట్లలోకి ఇదే అతిపెద్దది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్‌ ఇంజిన్‌ దీనిలో వినియోగించారు.

జీశాట్ 19 ఉపగ్రహ బరువు 3,136 కిలోగ్రాములు. నిజానికి ఈ స్థాయి బరువున్న ఉపగ్రహాలను ఇంత వరకు మన దేశం నుంచి ప్రయోగించలేదు. ఇదే మొదటిసారి. 2,300 కిలోగ్రాములకు పైన బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు భారత్ ఇప్పటి వరకు విదేశీ ప్రయోగ కేంద్రాలను ఆశ్రయించాల్సి వచ్చేది.  ఈ ప్రయోగం విజయవంతమైతే ఇకపై భారత్ విదేశాలపై ఆధారపడనక్కర్లేదు. దీంతో ఒక్కో ప్రయోగం రూపంలో రూ.400 కోట్లు ఆదా అవుతాయి. ఇప్పటి వరకు ఇంత భారీ స్థాయి బరువుగల ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం అమెరికా, రష్యా, చైనా, జపాన్ లకు మాత్రమే ఉండగా, భారత్ కూడా వీటి సరసన చేరుతుంది.

GSLV Mk 3: As India Launches Heaviest Rocket
జీఎస్ఎల్వీ ఎంకే3-డీ1ను ఇస్రో స్వయంగా అభివృద్ధి చేసింది. ఇది 4,000 కిలోల వరకు బరువున్న ఉపగ్రహాలను జియోసింక్రనస్ ట్రాన్స్ ఫర్ కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు. తక్కువ ఎత్తులో ఉన్న భూ కక్ష్యలోకి అయితే 10,000 కిలోల బరువుగల ఉపగ్రహాలను ప్రవేశపెట్టగలదు. సైంటిస్టులు దీన్ని మాన్ స్టర్ రాకెట్ గా అభివర్ణిస్తున్నారు. అంతరిక్షంలోకి మానవులను పంపించాలన్న భారత్ కలను ఈ రాకెట్ సాకారం చేయగలదంటున్నారు. ఇప్పటికే ఇందుకోసం ఇస్రో కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది.

జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3డీ1 విశేషాలు..: రాకెట్‌ బరువు 640 టన్నులు. ఎత్తు 43 మీటర్లు. ఇందులో మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో ఎస్‌200 మోటార్లు రెండు, రెండో దశలో ఎల్‌110 లిక్విడ్‌ కోర్‌ ఇంజిన్‌, మూడో దశలో సీ25 క్రయోజెనిక్‌ ఇంజిన్‌ ఉన్నాయి. ప్రయోగం అనంతరం 16.20 నిమిషాలకు జీశాట్‌-19 ఉపగ్రహం రాకెట్‌ నుంచి విడిపోనుంది. ఇది భూ అనువర్తిత బదిలీ కక్ష్య (జీటీవో)లోకి 4వేల కిలోలను, దిగువ భూ కక్ష్యలోకి 8వేల కిలోలను మోసుకెళుతుంది.

- Advertisement -