విత్తణ గణపతులను పంపిణీ చేసిన ఎంపీ సంతోష్..

150
- Advertisement -

పర్యావరణ అవగాహన, పచ్చదనం పెంపులో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినాయక చవితి సందర్భంగా సీడ్ గణేషాను పంపిణీచేస్తోంది. ఈ కార్యక్రమాన్ని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్, పంజాగుట్ట సమీపంలో ఉన్న నెక్ట్స్ గలేరియా మాల్‌లో సందర్శకులకు ఎం.పీ చేతులు మీదుగా విత్తణ గణపతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత, గో రూరల్ సంస్థ సీఈవో సునీల్, టీ న్యూస్ సీజీఎం ఉపేందర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, తదితరులు పాల్గొన్నారు.

పూర్తిగా పర్యావరణహితంగా గణేష్ ప్రతిమలను తయారు చేయటం ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ స్ఫూర్తివంతమైన కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు ప్రకటించారు. స్వచ్చమైన మట్టి, కొబ్బరి నాచు (కోకో పౌడర్)ను వాడుతూ ప్రతిమలను తయారు చేశారు. ఈ సారి గణేష్ ప్రతిమలతో పాటు వివిధ రకాల విత్తనాలును మట్టిలో పొందుపరిచారు. హరిత తెలంగాణ సాధనలో చింత, వేప చెట్లను విరివిగా పెంచాలన్న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఆశయం మేరకు ఆ విత్తనాలతో కూడిన మట్టి గణేషులను తయారు చేసి, పంపిణీ చేస్తున్నట్లు ఎం.పీ సంతోష్ కుమార్ వెల్లడించారు. అలాగే పెద్ద సంఖ్యలో ఔషధ మొక్కల అవసరాన్ని గుర్తించి, వాటి విత్తనాలతో కూడా సీడ్ గణేషాల తయారీ, పంపిణీ కొనసాగుతుందన్నారు.

ముఖ్యంగా పెరుగుతున్న కాలుష్యం తద్వారా జరుగుతున్న పర్యావరణ నష్టాన్ని తగ్గించాలన్న తలంపుతో విత్తన గణపతుల పంపిణీకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముందుకు వచ్చినట్లు ఎం.పీ తెలిపారు. ప్రతీ యేటా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని, ప్రజలు- భక్తులు వీలైనంత వరకు మట్టి ప్రతిమలను కొలిచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు నిచ్చారు. తద్వారా వాటి తయారీదారులకు ఉపాధి, పర్యావరణహితం అనే రెండు లక్ష్యాలు నెరవేరుతాయని ఎంపీ అన్నారు. పచ్చదనం పెంపుతో పాటు, పర్యావరణ రక్షణకు వీలైనన్ని చర్యలు తీసుకోవటంలో ప్రతీ ఒక్కరూ తగిన అవగాహనతో వ్యవహరించాలని కోరారు. నెక్ట్స్ గలేరియాలో ఈ కార్యక్రమం నిర్వహణకు ముందుకు వచ్చిన మాల్ మేనేజ్ మెంట్ ను ఎంపీ అభినందించారు.

- Advertisement -