గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అరుదైన గౌరవం..

86
- Advertisement -

మన ప్రాంతం, మన దేశం పచ్చగా, పర్యావరణ హితంగా ఉండాలి అనే లక్ష్యంతో పని చేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే గొప్ప సంగీత దర్శకుడు, కీర్తిశేషులు పద్మవిభూషణ్ ఉస్తాద్ గులామ్ ముస్తఫా ఖాన్ సంస్మరణ వేడుకల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పాల్గొంది. ముంబయి బాంద్రా వెస్ట్‌లో జరిగిన కార్యక్రమంలో స్థానిక చౌరస్తాకు ప్రభుత్వం ఉస్తాద్ గులామ్ ముస్తఫా ఖాన్ చౌక్ గా నామకరణం చేసింది. శిలా ఫలకం ఆవిష్కరణ కార్యక్రమంలో మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే, బాలీవుడ్ ప్రముఖ సింగర్స్ హరిహరన్, శాన్, గులామ్ ముస్తఫా ఖాన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు ప్రత్యేక ఆహ్వానం అందింది. మంత్రి ఆదిత్య థాకరేకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పై రూపొందించిన పుస్తకాన్ని, కండువాను ప్రతినిధులు అందించారు. చౌక్ ప్రారంభోత్సవం తర్వాత ఉస్తాద్ గులామ్ ముస్తఫా ఖాన్ కు నివాళిగా ఆయన నివాసంలో కుటుంబ సభ్యులు, బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు మొక్కలు నాటారు.

రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ప్రశంసించారు. తమను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముంబైలో ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉస్తాద్ గులామ్ ముస్తఫా ఖాన్ సోదరుడు ఉస్తాద్ ఆఫ్తాబ్ అలాం ఖాన్, కుమారులు ఖాదిర్ ముస్తఫా, రబ్బానీ ముస్తఫా, హసన్ ముస్తఫా, సయ్యద్ ముషారఫ్, జోసెఫ్ ఫెర్నాండెజ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -