పెద్ద మనసు చాటుకున్న పారిశుద్ధ్య కార్మికురాలు..

186
GHMC worker Alivelu
- Advertisement -

మానవాళి గతంలో ఎన్నడూ ఎరుగని కరోనా వైరస్ అనేకమంది మనసుని కదిలిస్తుంది. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న కష్టకాలంలో అనేక మంది తమకు తోచిన విధంగా పరులకు ఉపకారం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇలానే ఈరోజు హైదరాబాద్‌కు చెందిన అలివేలు తన పెద్ద మనసును చాటుకుంది. జియగుడాకు చెందిన అలివేలు, గత ఐదు సంవత్సరాలుగా జిహెచ్ఎంసిలో పారిశుద్ధ్య విభాగంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న అలివేలు తన పెద్ద మనసును చాటుకున్నారు. ఆమె ఈరోజు 12000 తన నెల జీతం లోంచి పదివేల రూపాయలు తీసి మంత్రి కే. తారకరామారావు ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది.

ఈ సందర్భంగా అలివేలు మంచి మనసును అభినందించిన మంత్రి కేటీఆర్ ఆమెతో కాసేపు మాట్లాడారు. ఇంత తక్కువ కుటుంబ ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఒక నెల జీతాన్ని కరోనా పోరు కోసం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన అలివేలును మంత్రి అభినందించారు. ఆమె పిల్లలు భర్త ఏం చేస్తారంటుటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తన భర్త శ్రీశైలం కూరగాయల మార్కెట్‌లో రోజువారి కూలీగా పని చేస్తారని, తన పిల్లలు చదువుకుంటున్నారని అలివేలు ఈ సందర్భంగా తెలిపింది.

Alivelu

తన కుటుంబానికి ఎప్పుడైనా నేను అండగా ఉంటానని, ఏదైనా సహాయం కావాలంటే చెప్పాలని అని మంత్రి కేటీఆర్ అనగా, తాను ఎలాంటి లాభాపేక్ష కానీ ప్రయోజనం కానీ ఆశించి ఈ విరాళం ఇవ్వడం లేదని కేవలం ఇతరులకు ఈ కష్టకాలంలో ఉపయోగపడాలన్న ఆలోచనతోనే ఇస్తున్నానని మంత్రికి సమాధానం ఇచ్చింది. తాను నెల రోజుల వేతనాన్ని మొత్తం ఇస్తానని చెప్పగా అనేకమంది ఈ కష్టకాలంలో ఎందుకు ఇవ్వడం మీతో ఉంచుకోమని సూచించారని అయితే తన భర్త శ్రీశైలం, తన పిల్లలు శివ ప్రసాద్, వందనలు నా ఆలోచనకి అండగా నిలిచారని తెలిపింది.

రెండో ఆలోచన లేకుండా తనకు తోచిన మేర సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన అలివేలు మంచి మనసు పట్ల మంత్రి అభినందనలు వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికురాలుగా ఒకవైపు కరోనా పోరులో ముందు వరుసలో ఉన్న అలివేలు, విరాళం సైతం ఇచ్చేందుకు ముందుకు రావడం ఆమె కాకుండా మొత్తం కరోనా పోరులో ముందువరుసలో నిలిచిన ప్రతి ఒక్కరికి మరింత గౌరవాన్ని అందిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు.

- Advertisement -