గ్రేటర్ హైదరాబాద్లో మ్యాన్వల్ స్కావెంజింగ్ (పాకి పని) వృత్తిలో గతంలో పనిచేసినవారి అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది. 2003 సంవత్సరం నాటికే రాష్ట్రంతో పాటు హైదరాబాద్లో మ్యాన్వల్ స్కావెంజింగ్పై పూర్తిగా నిషేదం విధించిన అనంతరం దాదాపుగా ఈ వృత్తిని మానివేశారు.
అయితే 2003 సంవత్సరం కన్నా ముందు ఈ వృత్తిపై ఆధారపడ్డవారి వివరాలను సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు నేడు జిహెచ్ఎంసి కార్యాలయంలో సఫాయి కర్మచారి సంఘాల ప్రతినిధులతో కమిషనర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, విభాగాధిపతులు హాజరైయ్యారు.
ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. సఫాయి కర్మచారి కార్మికుల పూర్తి వివరాలను జిహెచ్ఎంసికి అందజేయాలని సమావేశానికి హాజరైన ప్రతినిధులకు సూచించారు. ఇప్పటి వరకు నగరంలో 140 మంది వివరాలను జిహెచ్ఎంసి సేకరించిందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన బి.ఓ.టి టాయిలెట్ల నిర్వహణను సఫాయి కర్మచారి సంఘాలకు అందజేసే ప్రతిపాదనలు పరిశీలిస్తున్నామని తెలిపారు.
జిహెచ్ఎంసిలో పలు ఇంజనీరింగ్ పనులకు సంబంధించిన కాంట్రాక్ట్ లను మేదరి సామాజిక వర్గానికి అందేలా టెండర్ నిబంధనలో మార్పులు చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్టు తెలిపారు. జిహెచ్ఎంసి శానిటేషన్ విభాగంలోని వాల్మికి సమాజిక వర్గానికి చెందిన పలువురు కార్మికులు ఉన్నారని, జిహెచ్ఎంసి శానిటేషన్ కార్మికులందరికీ ప్రతి మూడు నెలలకు ఒక సారిచొప్పున తప్పనిసరిగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు.
2015 నుండి ఇప్పటి వరకు జిహెచ్ఎంసిలో 223 మందికి కారుణ్యనియామకాలను చేయగా వీటిలో 33 మంది సఫాయి కర్మచారి వర్గానికి చెందినవారు ఉన్నారని కమిషనర్ వివరించారు. జిహెచ్ఎంసి పరిధిలో సఫాయి కర్మచారి కార్మికులకు ఏవిధమైన సమస్య ఉన్నా నిబంధనలను అనుసరించి పరిష్కరించనున్నట్టు కమిషనర్ స్పష్టం చేశారు.