గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటి వాటి ఆవశ్యకతపై, పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. భారతరత్న పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్కలాం జయంతి సందర్బంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గజల్ సంగీత దర్శకుడు కుల్దీప్ సింగ్, గాయకుడు జస్వీందర్ సింగ్, గజల్స్ రచయిత షకీల్ షాయర్లు పాల్గొని మొక్కలు నాటారు. వీరితో పాటుగా నిర్మాత కొనతం లక్ష్మణ్ కూడా వెంట ఉన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొక్కలను పెంచడం ద్వారా పచ్చదనం పెరిగి పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని, మానవాళి సురక్షిత జీవనం గడుపుతుందన్నారు.
ప్రకృతికి, సంగీతానికి విడదీయలేని అనుబంధం ఉందని, ఈ రెండింటితోనే మన జీవితాలు సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఉంటాయన్నారు. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో గ్రీనరీ పెరిగి మరింత పచ్చదనం సంతరించుకుందని ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొందని అన్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి మహాత్తర కార్యక్రమంలో పాల్గొనే గొప్ప అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కి కుల్దీప్ సింగ్, గాయకుడు జస్వీందర్ సింగ్, రచయిత షకీల్ షాయర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు.
ఈ సందర్బంగా గ్రీన్ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్స్ కరుణాకర్ రెడ్డి, రాఘవ పాల్గొని ఎంపీ సంతోష్ కుమార్ వృక్షవేదం పుస్తకాన్ని గజల్ సంగీత దర్శకుడు కుల్దీప్ సింగ్, గాయకుడు జస్వీందర్ సింగ్, రచయిత షకీల్ షాయర్ కి బహుకరించారు.