మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి..

147
ktr
- Advertisement -

నల్ల‌గొండ ఫ్లోరైడ్ ముఖచిత్రంగా దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితులైన ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి శుక్ర‌వారం మంత్రి కేటీఆర్‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో క‌లిశారు. ఈ సందర్భంగా స్వామి యోగక్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. గతంలో అంశాల స్వామి జీవనాధారం కోసం ప్రత్యేకంగా ఒక షాప్ (సెలూన్)ను మంత్రి ఏర్పాటు చేయించారు. తాజాగా అంశాల స్వామికి పక్కా ఇల్లు నిర్మించి అందించనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. ప్రభుత్వం త‌ర‌పున‌ అంశాల స్వామికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాల్సిందిగా స్థానిక జిల్లా కలెక్టర్ ప్ర‌శాంత్ జీవ‌న్ పాటిల్‌ను ఆదేశించారు. స్వామికి ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్య‌త‌ను తీసుకోవాల్సిందిగా పార్టీ సీనియర్ నాయకులు కర్నాటి విద్యాసాగర్‌కు అప్ప‌గించారు.

కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తన సొంత ఊరు పరిసర గ్రామ నివాసి అయిన అంశాల స్వామికి పక్కా ఇల్లు అందించేందుకు విద్యాసాగర్ ముందుకొచ్చారు.ఇంటి నిర్మాణ బాధ్యత తీసుకునేందుకు ముందుకు వచ్చిన కర్నాటి విద్యాసాగర్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. గతంలో తన జీవనం సాగేందుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తగిన ఏర్పాట్లు చేసిన మంత్రి కేటీఆర్, ఇప్పుడు తన సొంత ఇంటి కల నెరవేర్చుతుండ‌టంపై స్వామి సంతోషం వ్య‌క్తం చేస్తూ కేటీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరైడ్ సమస్య నుంచి క్రమంగా విముక్తి లభిస్తున్న‌ట్లు తెలిపిన స్వామి.. సీఎం కేసీఆర్‌ను కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలుప‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

- Advertisement -