బిలియన్‌ జనాభా ప్రతినిధి మన పీవీ :వాణీదేవి

381
- Advertisement -

ఒక బిలియన్ కు పైగా జనాభా ఉన్న దేశానికి ప్రధానిగా నేతృత్వం వహించిన పీవీ నరసింహారావు విగ్రహాన్ని విదేశాలలో మొదటి సారిగా సిడ్నీ స్ట్రాత్ ఫీల్డ్ లో ఆవిష్కరించడం… చాలా గర్వంగా ఉందని పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు, ఓవర్సీస్ కమిటీ కన్వీనర్ మహేష్ బిగాల అన్నారు. శనివారం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం స్ట్రాత్ ఫీల్డ్ హోంబుష్ కమ్యూనిటీ సెంటర్లో స్వర్గీయ పీవీ నరసింహారావు విగ్రహాన్ని స్ట్రాత్ ఫీల్డ్ మేయర్ మాథ్యూ బ్లాక్ మోర్, కౌన్సిలర్ సంధ్యారెడ్డి, పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి, పీవీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో ఆవిష్కరించారు. స్ట్రాత్ ఫీల్డ్ టౌన్ హాలులో ఏర్పాటు చేసిన పీవీ విగ్రహావిష్కరణ ఉత్సవాలను జ్యోతి వెలిగించి, భారత, ఆస్ట్రేలియా జాతీయ గీతాలాపనతో ప్రారంభించారు.

ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాలోని నేటివ్ అబొరిజనల్స్ ను స్మరించుకున్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు విదేశాల్లో పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా గొప్ప కార్యక్రమమని కొనియాడారు. ఎంపీ కే.కేశవరావు ఆధ్యక్షతన పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేయడం, అందులో తనకు ప్రాతినిధ్యం కల్పించి.. విదేశాల్లో ఉత్సవాలు జరపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. అందులో భాగంగానే సుమారు 50 దేశాల్లో పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించామన్నారు. తాను 1995లో మొదటి సారిగా అస్ట్రేలియాకు వచ్చినప్పుడు స్ట్రాత్ ఫీల్డ్ లోనే నివసించానని, ఇప్పుడు అక్కడే మేయర్, కౌన్సిల్ అనుమతితో పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా గర్వకారణంగా ఉందని తెలిపారు ఒక బిలియన్కుపైగా జనాభాకు ప్రాతినిధ్యం వహించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం చారిత్రాత్మకమైన రోజుగా చెప్పారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా స్ట్రాత్ ఫీల్డ్ మేయర్ మాథ్యూ బ్లాక్ మోర్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా అన్ని దేశాల ప్రజలను కలుపుకొనిపోయే సౌభ్రాతృత్వమున్న దేశమని అన్నారు. ఇలాంటి దేశంలో పీవీ నరసింహారావు లాంటి మాజీ భారత ప్రధాని విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషకరమని, గొప్ప కార్యక్రమమని ఆయన కొనియాడారు.

ఈ సందర్భంగా పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ.. తండ్రితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పీవీని పదవులు ఎలా వరించాయి.. రాజకీయాలు, పరిపాలనలో పీవీ ముద్రను వివరించారు. భారత దేశ ప్రధానిగా పీవీ చేపట్టిన సంస్కరణలు, తీసుకొచ్చిన విప్లవాత్మకమైన పథకాలు, సంస్కరణలను ఎమ్మెల్సీ వాణీదేవి వివరించారు. పీవీ శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఘనంగా నిర్వహించడానికి తీసుకున్న చొరవను, ఎంపీ కే.కేశవరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీని కొనియాడారు. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని వివరించేటప్పుడు భావోద్వేగానికి గురయ్యారు. విగ్రహావిష్కరణకు సహకారం అందించిన ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిలర్ సంధ్యారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి కౌన్సిల్‌కు ఎన్నికైన మొదటి వ్యక్తినని.. సీఎం కేసీఆర్ ఆలోచనలమేరకు పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, అందులోనూ తమ కౌన్సిల్ పరిధిలో చేసుకోవడం గర్వంగా ఉందన్నారు. ఇందులో భాగస్వాములైనవారికి, సహకారం అందించిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిలర్లు రాజ్ దత్తా, శ్రీని పిల్లమర్రి, లివింగ్ స్టర్ చెట్టిపల్లి, పీవీ బంధువు డాక్టర్ హేమచంద్ర, ఇతర కుటుంబ సభ్యులు, డాక్టర్ భారతిరెడ్డి, హర్ మోహన్ వాలియా, పీవీఎన్ఆర్ లోకల్ కోర్ కమిటీ సభ్యులు కేరీరెడ్డి, అరవింద్, రాజేష్ రాపోలు, కిషోర్ బెండె, వెంకటరమణ, ఉపేందర్ గాదెతోపాటు స్థానిక ఇండియన్, తెలుగు, తెలంగాణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూచిపూడి తదితర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

- Advertisement -