శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఫిదా’ బాక్సాఫిస్ వద్ద భారీ వసూళ్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అమెరికాలో పెరిగిన అబ్బాయిగా వరుణ్ తేజ్ .. తెలంగాణ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయిగా సాయిపల్లవి నటించారు. వైవిధ్యభరితమైన ఈ ప్రేమకథా చిత్రం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఈ మూవీలోని వచ్చిండే….పిల్లా మెల్లగ వచ్చిండే… అనే పాట సరికొత్త రికార్డు నెలకొల్పింది.
యూట్యూబ్లో 150 మిలియన్ మార్క్ (15 కోట్లు) వ్యూస్ దాటిన తొలి తెలుగు పాటగా నిలిచింది. ఈ పాటలో సాయి పల్లవి అందానికి అభినయానికి కుర్రకారు ఫిదా అయిపోయారు. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆ పాట విపరీతంగా ఆకట్టుకుంది. విశేషమైన జనాదరణ పొందిన ఈ పాట ఇప్పటికీ పలు స్టేజ్ షోల డ్యాన్స్ షోలలో మార్మోగుతూనే ఉంది.
యూట్యూబ్లో ఈ పాటను ఇప్పటివరకూ 150 మిలియన్ల (15 కోట్లు) మందికి పైగా వీక్షించారు. ఇదే విషయాన్ని `ఫిదా` చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల…తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘150 మిలియన్ మార్క్ను దాటిన తొలి తెలుగు పాట ఇదే.. అద్భుతమైన మీ స్పందనకు ధన్యవాదాలు.. ఈ మ్యాజిక్లో భాగమైన ‘ఫిదా’ టీమ్కి శుభాకాంక్షలు’ అని శేఖర్ కమ్ముల పోస్ట్ చేశారు.