ఉత్తమ్‌…ఉత్తుత్తి కెప్టెన్

235
x Jawan Prabhakar Reddy Criticises Uttam Kumar
- Advertisement -

ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ సైనికుడు బోయినపల్లి ప్రభాకర్ రావు ఫైర్ అయ్యారు. ఉత్తమ్ ని ఉత్తర కుమారుడు గా అభివర్ణించారు. తనకు పదహారేళ్ళ వయసప్పుడే ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయ్యానని ఆయన చెప్పుకుంటారు కానీ ఆయన కెరీర్ అంతా గందరగోళం అని , ఉత్తమ్‌ దేశానికి సేవ చేసిందేమీ లేదన్నారు. 500 కోట్ల రూపాయల విలువైన రెండు ఎయిర్ క్రాఫ్ట్ లు ఆయన నిర్లక్ష్యం వల్ల క్రాష్ అయ్యాయని ప్రభాకర్ రావు తెలిపారు.

1979లో పంజాబ్ లోని ఆదంపూర్ లో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ గా తాను పని చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్లైట్ లెఫ్టినెంట్ గా పనిచేసేవారని ఆయన తెలిపారు. తాను మంచిపేరు తెచ్చుకున్న పైలట్ గా, కెప్టెన్ గా ఉత్తమ్ చెప్పుకుంటారని వాస్తవానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కెప్టెన్ అని పిలవరు..ఫ్లైట్ లెఫ్టినెంట్ గా వ్యవహరిస్తారని చెప్పారు. బ్రిటిష్ ఆర్మీలో మాత్రమే ఫ్లైట్ కెప్టెన్ అని పిలుస్తారని ఆయన తెలిపారు.

ఎయిర్ క్రాఫ్ట్ లను సరిగా నడపలేని వాడు కాంగ్రెస్ పార్టీని ఎలా నడుపుతాడో అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులకు ప్రభాకర్ రావు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కించపరిచేలా మాట్లాడారని, ఆయన నోటిదురుసు తగ్గించుకోక పోతే మాజీ సైనికులంతా కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంగతి చూసుకుంటామని ప్రభాకర్ రావు హెచ్చరించారు. ఆయన వెళ్లిన ప్రతి చోటికల్లా వెళ్లి ఆయన బండారాన్ని ప్రజలకు వివరిస్తామని అన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ లా క్రాష్ విషయంలో ఉత్తమ్ మూడు నెలల పాటు విచారణను ఎదుర్కొన్నారని ప్రభాకర్ రావు వివరించారు. విపక్షాలతో పొత్తులు పెట్టుకోవడం వల్ల తానేదో అయిపోతానని, సీఎం ను అవుతానని ఉత్తమ్ కుమార్ రెడ్డి పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

తాను కరీంనగర్ మాజీ సైనికుల హౌసింగ్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సైనికుల ఇళ్ల కోసం ఆయన చుట్టూ తిరిగామని, పన్నెండు వందల కోట్ల రూపాయల హౌసింగ్ స్కాం లో ఉత్తమ్ హస్తం ఉందని ఆరోపించారు. చివరకు తాను మిస్ గైడ్ అయ్యానని చేతులెత్తేశారని చెప్పారు. ఉత్తమ్‌తో రాష్ట్రానికి ఒరిగిదేమి లేదని, మరోసారి ఉత్తమ్‌ సీఎం కేసీఆర్‌ పై విమర్శలు చేస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు.

- Advertisement -