మాజీ డీఎస్పీ…మనసులో మాట

64
- Advertisement -

నేను డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి 12 ఏండ్లు పూర్తి అయిన తర్వాత కూడా, నన్ను ఇంకా జనం గుర్తుంచుకున్నారన్న విషయం ఈ రోజు వస్తున్న మెసేజ్ ల ద్వారా అర్థం అవుతుంది.చాలా సంతోషం.వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు.కొందరు జర్నలిస్ట్ లు బైట్ కావాలి అని అడుగుతున్నారు.నేను దీనికి సుముఖంగా లేను. ఎందుకంటే నేను ప్రస్తుతం ప్రశాంత జీవితం గడుపుతున్నాను.అందుకే ఇలా ప్రకటన చేయాల్సి వచ్చింది.

ప్రస్తుతం నేను ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ యజ్ఞ బ్రహ్మ గా,వేద ప్రచారకురాలిగా, ఆర్ష కవయిత్రిగా తపోమయ జీవనం గడుపుతున్నాను.పూర్తి సాత్వికంగా మారాను.

ఉద్యమ సమయంలో నన్ను 4.12.2011 న సస్పెండ్ చేశారు. అన్ని పేపర్ల లో ఫోటో వేసి మరీ ఆ వార్తను హైలేట్ చేసి రాశారు. నాది దేశద్రోహం అన్నారు.చాలా బాధేసింది. సుష్మా స్వరాజ్ గారు ఒక్కరే దాన్ని ఖండించారు. ఢిల్లీ లో దీక్ష,తెలంగాణ యాత్ర,పరకాల ఉప ఎన్నిక లో పోటీ, బీజేపీ సభ్యత్వం తీసుకోవడం ఇవన్నీ ఉద్యమంలో భాగంగానే చేశాను.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా నేను ఎవరిని కలవలేదు. ఎపుడూ నా కోసం నేను ఏమీ అడగలేదు.నా రాజీనామా ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు వినతి పత్రం ఎన్నడూ ఇవ్వలేదు అలాంటప్పుడు ఇలా నేను సడెన్ గా వార్తల్లోకి ఎలా వచ్చాను?ఇంతమందికి నా కాంటాక్ట్ నంబర్ ఎలా తెలిసింది ? ఆశ్చర్యంగా ఉంది.

ఏది ఏమైనా ఇప్పుడు కూడా నాకు యాచించడం ఇష్టం లేదు.ఆ అవసరం నాకు లేదు కూడా. ఒకవేళ ప్రజల ఒత్తిడి మేరకు, ప్రస్తుత ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ జాబ్ ఇచ్చినా, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నేను దానికి పూర్తి న్యాయం చేయలేను. రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల నా ఫిజికల్ ఫిట్నెస్ పోయింది . చాలా కాలం గడిచింది కాబట్టి పోలీస్ ఆప్టిట్యూడ్ ను కూడా నేను కోల్పోయాను .

ఇక టెక్నికల్ విషయాలకు వచ్చినట్లైతే,పోలీస్ సర్వీస్ రూల్స్ నా నియామకాన్ని ఒప్పుకోవు.ఎవరైనా హై కోర్ట్ లో పిల్ వేస్తే నా నియామకం రద్దు అవచ్చు కూడా. కొరివి తో తల గోక్కున్నట్లు అవుతుంది. గతంలో ముఖ్యమంత్రి రోశయ్య గారు ఇచ్చారు కదా అని వెళితే ఏం జరిగిందో ,18 నెలలు ఎంత ఇబ్బంది పడ్డానో నాకు ఇంకా గురుతే. అందుకే నేను ఉద్యోగం అడగను.కాని బతికి ఉన్నంత వరకు ఏదో రకంగా ప్రజా సేవా చేస్తూనే ఉంటాను.

త్యాగి నుండి యోగినీ అయ్యి పతంజలి సంస్థ ద్వారా ఆయుర్వేదము,యోగలను ప్రచారం చేశాను. రోగిని కూడా అయ్యి కోలుకున్న.ఇప్పుడు తపస్వి నై, నిత్యాగ్నిహోత్రి ని అయ్యి సనాతన ధర్మ మూలాధారమైన వేదం, యజ్ఞమును ప్రచారం చేస్తున్నా. ఇదే మార్గంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్న.ఆనాడు నాలో పొంగింది దేశ భక్తి అయితే ఇప్పుడు నాలో దైవ భక్తి నుండి ఉంది. ప్రస్తుతం నాలో క్షాత్రత్వం
పోయి బ్రాహ్మణత్వం ప్రవేశించింది.
అడగందే అమ్మైనా అన్నం పెట్టదు కదా!! అలాగే ఆకలి వేయనిదే ఎవరు కూడా అన్నం కావాలి అని అడిగరు.

( తెలంగాణ ఉద్యమం ముద్దు బిడ్డ DSP DOMAKONDA NALINI గారి ఫెస్బుక్ వాల్ నుండి సేకరణ)

- Advertisement -