తెలంగాణ వ్యవసాయ రంగంలో చారిత్రక మార్పులకు దోహదపడిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ పథకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎకనామిక్ సర్వే–2026 ప్రత్యేకంగా ప్రశంసించింది. సాగునీటి వసతుల విస్తరణలో తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికి ఆదర్శంగా నిలిచిందని సర్వే నివేదిక పేర్కొంది.
ఎకనామిక్ సర్వే–2026 ప్రకారం, కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అలాగే మిషన్ కాకతీయ కార్యక్రమాల అమలుతో తెలంగాణలో సాగునీరు అందే భూముల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 2014లో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగునీటి విస్తీర్ణం, 2023 నాటికి 2.2 కోట్ల ఎకరాలకు చేరినట్టు నివేదిక స్పష్టం చేసింది. అంటే కేవలం తొమ్మిదేళ్ల వ్యవధిలో దాదాపు 90 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందినట్టు కేంద్ర సర్వే వెల్లడించింది.
ఈ పథకాల వల్ల ఎండ ప్రాంతాలు సైతం సస్యశ్యామలంగా మారాయని, రైతుల ఆదాయం పెరగడంలో కీలక పాత్ర పోషించాయని ఎకనామిక్ సర్వే ప్రశంసించింది. చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలమట్టం పెరిగి, నీటి లభ్యత మెరుగుపడిందని పేర్కొంది. సాగునీటి మౌలిక సదుపాయాల అభివృద్ధి వల్ల పంటల ఉత్పత్తి, వ్యవసాయ స్థిరత్వం పెరిగాయని నివేదిక పేర్కొంటూ, తెలంగాణలో అమలు చేసిన ఈ నమూనాను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించవచ్చని సూచించింది.
Also Read:దుకాణాల్లో హైడ్రా రంగనాథ్ తనిఖీలు

