కొత్త జిల్లాల ఏర్పాటుపై మరో ముందడుగు పడింది.ములుగు, నారాయణపేట ఏర్పాటుపై ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేసింది. 30 రోజుల పాటు అభ్యంతరాలు, అర్జీల స్వీకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.
భూపాలపల్లి జిల్లాను విభజించి ములుగు, మహబూబ్నగర్ జిల్లాను విడదీసి నారాయణపేట జిల్లాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రజల నుండి అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించిన అనంతరం కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కు చేరనుంది.
వీటితో పాటు నిజామాబాద్ జిల్లాలో చండూరు, మోస్రా, మేడ్చల్ జిల్లాలో మూడుచింతలపల్లి, సిద్దిపేట జిల్లాలో నారాయణరావుపేట మండలాలు కొత్తగా ఏర్పాటయ్యాయి. గుండాల మండలాన్ని జనగామ జిల్లా నుంచి విడదీసి యాదాద్రి భువనగిరి జిల్లాలో కలిపేందుకు మరో ఉత్తర్వునిచ్చింది.
ములుగు జిల్లాలో ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాలతో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
నారాయణపేట జిల్లాలో దామరగిద్ద, ధన్వాడ, కోస్గి, కృష్ణ, మద్దూరు, మాగనూరు, మక్తల్, మరికల్, నారాయణపేట, నర్వ, ఊట్కూరుతోపాటు కోయిల్కొండను కూడా కలిపి మొత్తం 12 మండలాలతో జిల్లా ఏర్పాటుకానుంది.