WEF సదస్సులో డోనాల్డ్ ట్రంప్!

6
- Advertisement -

ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం – WEF) వార్షిక సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొననున్నారు. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశం స్విట్జర్లాండ్‌లోని డావోస్‌లో నిర్వహించబడనుంది. సహకారం, సమగ్ర అభివృద్ధి, ఆవిష్కరణల ఆధారిత వృద్ధి అంశాలపై ఈ సదస్సు దృష్టి సారించనుంది.

2026 జనవరి 19 నుంచి 23 వరకు డావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశానికి డొనాల్డ్ ట్రంప్ హాజరవుతారని WEF అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు ఈ సమావేశంలో పాల్గొని కీలక గ్లోబల్ సమస్యలపై చర్చలు జరపనున్నారు. ఈ విషయాన్ని WEF తమ ‘ఎక్స్’ (X) ఖాతా ద్వారా వెల్లడిస్తూ, “అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డావోస్‌లో జరిగే WEF వార్షిక సమావేశం–2026లో పాల్గొంటారు” అని పేర్కొంది. అలాగే, 47వ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మూడు రోజులకే డావోస్ 2025లో ఇచ్చిన ఆయన ప్రత్యేక ప్రసంగాన్ని కూడా గుర్తు చేసింది.

ఈ ఐదు రోజుల సదస్సు A Spirit of Dialogue అనే థీమ్‌తో జరగనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య సమన్వయం, అన్ని వర్గాల భాగస్వామ్యంతో ఐదు ప్రధాన ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంపై చర్చలు జరగనున్నాయి. వృద్ధి, స్థిరత్వం, ఆవిష్కరణలు ప్రధాన ప్రాధాన్యాలుగా ఉండనున్నాయి.

ఈ సదస్సుకు భారత్ నుంచి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవిస్ తదితరులు హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కనీసం నలుగురు మంత్రులు—అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి, కె. రామ్ మోహన్ నాయుడు—తో పాటు ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. భారత్ నుంచి 100 మందికి పైగా అగ్రశ్రేణి సీఈవోలు హాజరవుతారని అంచనా.

ఫడణవిస్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, తెలంగాణ సీఎం ఏ. రేవంత్ రెడ్డి, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా డావోస్‌కు వెళ్లనున్నారు. ముకేశ్ అంబానీతో పాటు టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, బజాజ్ గ్రూప్ చైర్మన్ సంజీవ్ బజాజ్, జూబిలెంట్ భర్తియా గ్రూప్ చైర్మన్ హరి ఎస్. భర్తియా, టీవీఎస్ మోటార్ చైర్మన్ సుదర్శన్ వేణు డావోస్‌కు వెళ్లనున్నారు. అలాగే యాక్సిస్ బ్యాంక్ సీఈవో అమితాబ్ చౌధరీ, గోద్రేజ్ గ్రూప్ చైర్మన్ నాదిర్ గోద్రేజ్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, జెరోధా సహ-వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, భారతి గ్రూప్ వ్యవస్థాపకుడు సునీల్ భారతి మిట్టల్, ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకణి, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పారేఖ్, విప్రో చైర్మన్ రిషాద్ ప్రేమ్జీ, ఎస్సార్ గ్రూప్ సీఈవో ప్రశాంత్ రుయా, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ, రీన్యూ సీఈవో సుమంత్ సిన్హా తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

Also Read:ఈడీ సోదాలు..కోట్ల రూపాయలు స్వాధీనం

- Advertisement -