తీన్మార్ మల్లన్నపై పరువునష్టం దావా వేసిన మంత్రి పువ్వాడ..

72
Teenmar Mallanna
- Advertisement -

జర్నలిస్ట్, క్యూ న్యూస్ యూట్యూబ్‌ చానల్ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్‌కు గట్టి షాక్‌ తగిలింది. మల్లన్నపై పరువునష్టం దావా వేశారు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్. జర్నలిస్ట్ ముసుగులో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా అసత్య ఆరోపణలు చేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు మంత్రి పువ్వాడ.

తీన్మార్ మల్లన్న వ్యవహారిస్తున్న తీరు పూర్తిగా కల్పితమని, ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తున్నందున సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం 10 కోట్ల రూపాయలు పరిహరం చెల్లించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నోటీసుల్లో పేర్కొన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తన న్యాయవాది చేత తీన్మార్ మల్లన్నకు ఈ నోటీసుల పంపారు.

నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేసి ప్ర‌చారం పొందాల‌నే దురుద్దేశంతోనే తీన్మార్ మల్లన్న తన ఛానల్, పత్రికలో అబ‌ద్ధాలు చెప్పారని నోటీసుల్లో న్యాయ‌వాది పేర్కొన్నారు. రాజకీయ దుర్బుద్ధితో, జర్నలిస్ట్‌గా చెలామణి అవుతూ జర్నలిజంలోని కనీస ప్రమాణాలు, విలువలు పాటించకుండా అసత్యపు ప్రచారం చేశారని న్యాయ‌వాది పేర్కొన్నారు. అంతేకాదు మల్లన్న చ‌ట్ట ప్రకారం త‌గిన చ‌ర్యలకు అర్హుల‌వుతార‌ని నోటీసుల్లో న్యాయ‌వాది తెలిపారు. 7 రోజుల్లో తన క్లైంట్ మంత్రి పువ్వాడ అజయ్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాల‌ని నోటీసుల్లో డిమాండ్ చేశారు.

- Advertisement -