ధాన్యం కొనుగోళ్లు సవ్యంగానే జరుగుతున్నాయి- సీఎస్‌

38
- Advertisement -

రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సీఎస్ సోమేశ్ కుమార్ ఈ రోజు పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పౌర సరఫరాల శాఖ కమీషనర్ అనిల్ కుమార్, మార్కెటింగ్ శాఖ అధికారులు భాస్కర్, అరుణ్, రుక్మిణి, పద్మజ, తదితరులు హాజరయ్యారు. సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సవ్యంగా, ఏవిధమైన ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 4.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 61,300 మంది రైతులనుండి 3,679 కేంద్రాల ద్వారా కొనుగోలు చేశామని వివరించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 7.80 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, మరో 8 కోట్ల గన్నీ బ్యాగుల కొనుగోలు టెండర్ల ప్రక్రియ నేడు పూర్తవుతుందని తెలిపారు. వీటికి తోడు మరో రెండున్నర కోట్ల గన్నీ బ్యాగులు జ్యుట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి త్వరలోనే అందుతాయని సీఎస్ అన్నారు. రాష్ట్రంలోని ధాన్యం కొనుగులు కేంద్రాలకు ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా ధాన్యం రాకుండా ఉండేందుకుగాను ఇతర రాష్ట్రాల నుండి సరిహద్దు గల 17 జిల్లాల సరిహద్దుల్లో 51 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని సీఎస్ వివరించారు.

సేకరించిన ధాన్యం వివరాలను వెంటనే అప్లోడ్ చేయాలని తద్వారా చెల్లింపులు త్వరితగతిన జరిగే అవకాశం ఉంటుందని సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. ధాన్యం సేకరణకు నిధుల సమస్య లేదని ఇప్పటికే, రైతులకు చెల్లింపులు చేయడానికి రూ. 5,000 కోట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిందని స్పష్టం చేశారు. నేటి వరకు సేకరించిన 4.3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు వెంటనే పంపడం జరుగుతుందని, వరంగల్, గద్వాల్, వనపర్తి, భూపాలపల్లి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వరి కోతలు ఆలస్యంగా అవుతాయని, వరి కోతలు ప్రారంభం కాగానే ఆయా జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సీఎస్ తెలిపారు.

- Advertisement -