ప్రపంచానికి పెను ముప్పు.. 85 దేశాలకు డెల్టా వేరియంట్..

177
- Advertisement -

కరోనా వైరస్ వేరియంట్లలో అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్న డెల్టా వేరియంట్ ఇప్పటి వరకు 85 దేశాలకు పాకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. గత రెండు వారాల్లోనే 11 దేశాల్లో ఇది బయటపడిందని, ఇది ఇలాగే కొనసాగుతూ పోతే ప్రపంచానికి పెను ముప్పుగా మారుతుందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది.

గతంలో వెలుగుచూసిన అల్ఫా కంటే ఈ వేరియంట్ 1.23 రెట్ల వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు జపాన్ అధ్యయనంలో తేలింది. డెల్టా వైరస్ సోకిన బాధితులకు ఆక్సిజన్ అవసరం, ఐసీయూలో చేరిక, మరణాలు ఎక్కువగా ఉన్నట్టు సింగపూర్ అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో కరోనా వైరస్ విజృంభణకు ఇదే కారణమని చెబుతున్నారు.

కాగా, డెల్టా వేరియంట్ వెలుగు చూడడానికి ముందు అల్ఫా, బీటా, గామా వేరియంటులను ‘ఆందోళనకర’ రకాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇప్పుడా స్థానంలో డెల్టా వేరియంట్ వచ్చి చేరింది. ప్రస్తుతం అల్ఫా వేరియంట్ 170 దేశాల్లో, బీటా రకం 119 దేశాల్లో, గామా వేరియంట్ 71 దేశాల్లోనూ ఉనికిలో వున్నాయి.

ఇక మన దేశంలో ఇప్పటివరకు 40కి పైగా డెల్టా ప్లస్‌ కేసులు నమోదయ్యాయి. మహా రాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయి. కర్ణాటక, తమిళ నాడు, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రా ల్లోనూ కేసులు మొదలయ్యాయి. డెల్టా ప్లస్‌ సోకినట్టు గుర్తించిన వారిలో తొలిసారిగా మధ్యప్రదేశ్‌లో మహిళ చనిపోయింది. ఆమె ఎటువంటి వ్యాక్సిన్‌ తీసుకోకపోవడంతో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉందని వైద్యులు ప్రకటించారు.

- Advertisement -