రేవంత్ సర్కార్.. దినదిన గండమేనా ?

32
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి దిన దిన గండంగా మారిందా ? సి‌ఎం పదవి విషయంలో రేవంత్ రెడ్డికి ఆందోళన మొదలైందా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన సి‌ఎం పదవి చేపట్టడంలో సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేక పోయారనే సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు దాదాపు అరడజన్ మంది కాంగ్రెస్ నేతలు సి‌ఎం పదవి కోసం పోటీ పడ్డారు. అయితే ఎలక్షన్ ముందు సి‌ఎం అభ్యర్థిని ప్రకటించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది అధిష్టానం. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి వారు సి‌ఎం పదవి కోసం గట్టిగానే ప్రయత్నించారు. కానీ అధిష్టానం రేవంత్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పటించింది..

దీంతో సి‌ఎం పదవి విషయంలో ఇతర కాంగ్రెస్ నేతలు నివురుగప్పిన నిప్పుల వ్యవహరిస్తున్నారనేది రాజకీయ వర్గాల్లో ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. రేవంత్ రెడ్డిని సి‌ఎం పదవి నుంచి దించేందుకు ఏ చిన్న అవకాశం దొరికిన ఇతర కాంగ్రెస్ నేతలు ఆ దిశగా అడుగులు వేస్తారని అందరికీ తెలిసిన విషయమే. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డిని సి‌ఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే ఆ పార్టీ 30 సీట్లు కూడా గెలుచుకునేది కాదని ఇటీవల బి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిండెంట్ కే‌టి‌ఆర్ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత విభేదాలు చూస్తే కే‌టి‌ఆర్ చేసిన వ్యాఖ్యాల్లో వాస్తవం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇకపోతే కాంగ్రెస్ లోని అంతర్గత కుమ్ములాటల కారణంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కువ రోజులు నిలిచే అవకాశం లేదనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. సొంత నేతల కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం కులుతుందని బీజేపీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం తమకు అవసరం లేదని, ప్రజలు అప్పగించిన ప్రతిపక్ష హోదాను గౌరవంగా నిర్వర్తిస్తామని బి‌ఆర్‌ఎస్ అగ్రనేతలు చెబుతున్నారు. అయితే ఇటీవల సి‌ఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని కుల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పరోక్షంగా వ్యాఖ్యానించారు దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆ పార్టీ నేతలే ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మొత్తానికి సి‌ఎం రేవంత్ రెడ్డికి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం దిన దిన గండంగానే ఉందనే చెప్పాలి.

- Advertisement -