బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో తృతీయ కూటమిని ఏర్పాటు చేస్తానని స్పష్టం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్, ఈ క్రమంలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. గత నెలలో కోల్ కతా వెళ్లి పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని కలిసి థర్డ్ ఫ్రంట్ పై చర్చించిన ఆయన, గతవారం స్పెషల్ ఫ్లయిట్ వేసుకుని బెంగళూరు వెళ్లి జేడీ (ఎస్) నేత, మాజీ ప్రధాని దేవెగౌడతో మాట్లాడి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తదుపరి కేసీఆర్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ను కలవాలని నిర్ణయించుకున్నారు.
మే నెల మొదటి వారంలో ఒడిశా వెళ్లేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్తో సమావేశమై దేశ రాజకీయాలపై చర్చించనున్నారు. ప్రస్తుతం ఒడిశా అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో మే మొదటివారంలో బీజేడీ(బీజు జనతా దళ్) చీఫ్ నవీన్ పట్నాయక్తో భేటీ కావాలని కేసీఆర్ నిర్ణయించారు.
కాగా,జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సైతం ఇటీవల తెలంగాణ వచ్చి, కేసీఆర్ తో మాట్లాడి వెళ్లారు. మరింతమంది ప్రాంతీయ పార్టీల నేతలను కలుసుకుని ప్రజా ఫ్రంట్ ఏర్పాటుపై సాధ్యమైనంత త్వరగా ఓ నిర్ణయానికి రావాలన్నది కేసీఆర్ అభిమతంగా తెలుస్తోంది.
Telangana CM K Chandrashekhar Rao to meet Odisha CM Naveen Patnaik in the first week of May. The two leaders will hold a discussion on national politics. pic.twitter.com/2KIssCws4d
— ANI (@ANI) April 17, 2018