తెలంగాణలో నూతన అసెంబ్లీ, సచివాలయం భవనాలకు నేడు శంకుస్ధాపన చేయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఉదయం 10 గంటలకు ప్రస్తుతం ఉన్న ప్రాంగణంలోనే డీ బ్లాక్ వెనుకవైపు ఉన్న గార్డెన్లో భూమిపూజ చేయనున్నారు. ఆ తర్వాత 11గంటలకు ఎర్రమంజిల్లో అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణానికి సీఎం శంకుస్ధాపన చేయనున్నారు.
30 ఎకరాల విస్తీర్ణంలో సచివాలయం, 17.9 ఎకరాల విస్తీర్ణంలో అసెంబ్లీ భవనాలను నిర్మించనున్నారు. ఈ రెండు నిర్మాణాలను అన్నిరకాల వసతులు ఉండేలా నిర్మించనున్నారు. మంత్రులు, అధికారుల సమీక్షలు, సమావేశాలు అన్నీ సచివాలయం వేదికగా జరిగేలా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇక, సచివాలయ నిర్మాణానికి రూ.400 కోట్ల వ్యయం అంచనా వేయగా… శాసనసభ, శాసన మండలి, సెంట్రల్ హాల్లను రూ.100 కోట్లతో నిర్మించనున్నారు. ఈ శంకుస్ధాపన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు , ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.