పివి జయంతి ఉత్సవాల నిర్వహణపై సీఎం సమీక్ష..

249
cm kcr
- Advertisement -

బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు దేశానికి విభిన్న రంగాల్లో అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచే విధంగా శత జయంతి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏడాది పొడవునా నిర్వహించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. పివి జన్మదినమైన జూన్ 28న హైదరాబాద్ లోని పివి జ్ఞానభూమిలో ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదే రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో పివి జయంతి వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణకు తక్షణం రూ.10 కోట్ల కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రగతి భవన్‌లో నేడు సిఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ కె.కేశవరావు, మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, పివి నరసింహారావు కుమారుడు పివి ప్రభాకర్ రావు, కుమార్తె వీణాదేవి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణ సందర్భంగా ఏఏ కార్యక్రమాలు నిర్వహించాలనే విషయంలో సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ ఉత్సవాల నిర్వహణ సందర్భంగా చేయాల్సిన కార్యక్రమాలను నిర్దేశించారు.

  • పివి జన్మదినమైన జూన్ 28న హైదరాబాద్ లోని పివి జ్ఞానభూమిలో శత జయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, పరిమిత సంఖ్యతో జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
  • జూన్ 28న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో పివి జన్మదిన వేడుకలు జరపాలి. మంత్రి కెటి రామారావు ఈ కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షిస్తారు.
  • పివికి తెలంగాణ రాష్ట్రంతోనే కాకుండా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా తదితర రాష్ట్రాలతో కూడా అనుబంధం ఉంది. దేశ వ్యాప్తంగా అనేక మందితో అనుబంధం ఉంది. అనేక మంది అనుచరులు, సహచరులు, అభిమానులు ఉన్నారు. ప్రధానిగా, విదేశాంగ శాఖ మంత్రిగా సేవలందించడం వల్ల విదేశాల్లో కూడా ఆయనతో అనుబంధం కలిగిన వారున్నారు. కాబట్టి పివి జయంతిని రాష్ట్ర, అంతర్రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహించాలి. ఎక్కడ ఏ కార్యక్రమం ఎలా నిర్వహించాలనే విషయంలో కార్యాచరణ రూపొందించాలి.
  • పివి శత జయంతి ఉత్సవాల నిర్వహణకు తక్షణం రూ.10 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రాబోయే రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలను బట్టి, నిధులు విడుదల చేసుకుంటూ పోతాం.
  • ‘పివి తెలంగాణ ఠీవి’ అని ప్రతీ తెలంగాణ బిడ్డ గర్వపడేలా ఆయన చరిత్ర ఉంది. ఆయన గొప్పతనం, చేసిన సేవలు విశ్వవ్యాప్తంగా తెలిసే విధంగా అనేక విభిన్న కార్యక్రమాలను ఏడాది పొడవునా నిర్వహించాలి.
  • రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మెమోరియల్ పెట్టిన విధంగానే హైదరాబాద్ లో పివి మెమోరియల్ ఏర్పాటు కావాలి. కెకె నేతృత్వంలోని కమిటి సభ్యులు రామేశ్వరం వెళ్లి వచ్చి, పివి మెమోరియల్ ఎలా ఉండాలో ప్రభుత్వానికి సూచించాలి.
  • వివిధ సందర్భాలకు సంబంధించిన పివి ఫోటోలను సేకరించాలి. వాటిని భద్రపరచాలి. ఫోటో ఎగ్జిబిషన్ లు నిర్వహించాలి.
  • ఐదు కాంస్య విగ్రహాలను నెలకొల్పాలి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, వంగరతో పాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో పివి విగ్రహాలు నెలకొల్పాలి. విగ్రహాల కోసం వెంటనే ఆర్డర్ ఇవ్వాలి.
  • రాష్ట్ర అసెంబ్లీలో పివి చిత్ర పటాన్ని పెట్టాలి.
  • పివి బహుముఖ ప్రజ్ఞాశాలి. స్వతంత్ర్య సమరయోధుడుగా, రాజకీయ నాయకుడుగా, జర్నలిస్టుగా, బహుభాషా కోవిదుడుగా, రచయితగా సేవలందించారు. ఆయా రంగాల్లో ఆయన చేసిన కృషిని తెలిపే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక సావనీర్ తీయాలి. సావనీర్ మాత్రమే కాకుండా వివిధ రంగాల్లో చేసిన కృషి, వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలతో ప్రత్యేక సంచికలు రావాలి.
  • పివి తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ గతిని మార్చేశాయి. పివికి ముందు దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది? పివి తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి ఎలా తయారైంది? అనే విషయాలను పొందు పరుస్తూ ప్రత్యేక సంచిక రావాలి. ఆర్థిక నిపుణులతో వ్యాసాలు రాయించాలి.
  • విద్యారంగంలో కూడా పివి ఎంతో కృషి చేశారు. సర్వేల్ లో మొదటి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టారు. అది దేశంలో గురుకులాల స్థాపనకు నాంది పలికింది. దేశ వ్యాప్తంగా నవోదయ పాఠశాలలను నెలకొల్పారు. ఇలా విద్యారంగాభివృద్ధికి చేసిన కృషిని వివరించే విధంగా రచనలు చేయించాలి. ప్రత్యేక సంచిక తీసుకురావాలి.
  • పివి నరసింహారావు దేశం గర్వించదగ్గ నాయకుడు. దేశ గతిని మార్చిన గొప్పవారు. భారతరత్న పురస్కారానికి సంపూర్ణ అర్హుడు. పివికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంత్రివర్గం, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ప్రధాని వద్దకు నేనే (సిఎం) స్వయంగా వెళ్లి భారతరత్న ఇవ్వాలని విన్నవిస్తా.
  • యావత్ దేశ ప్రజలకు ఆయన గొప్పతనం చెప్పే విధంగా జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడిలను శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానించాలి. వారు పాల్గొనే కార్యక్రమాలు ఎలా ఉండాలో డిజైన్ చేయాలి.
  • భారత పార్లమెంటులో పివి చిత్రపటం పెట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరతాం.
  • మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లతో పివికి ప్రత్యేక అనుబంధం ఉంది. వారిద్దరినీ కూడా భాగస్వాములను చేసే విధంగా ప్రత్యేక కార్యక్రమం రూపొందించాలి.
  • పివి గొప్ప సాహితీవేత్త. అనేక భాషలపై పట్టున్న పండితుడు. అనేక రచనలు చేశారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా పివి రాసిన పుస్తకాలను పునర్ముద్రించాలి. అముద్రితంగా ఉన్న వాటిని ముద్రించాలి. వాటిని లైబ్రరీలకు, విద్యా సంస్థలకు, ప్రముఖులకు ఉచితంగా పంపిణీ చేయాలి. ఈ బాధ్యతను సాహిత్య అకాడమీ, సాంస్కృతిక శాఖ తీసుకుంటుంది.
  • తెలంగాణలోనే కాక దేశ వ్యాప్తంగా పివి అభిమానులు, అనుచరులున్నారు. వారందరినీ సంప్రదించాలి. వారి సూచనలు తీసుకోవాలి. వారి అభిప్రాయాలను సావనీర్,ప్రత్యేక సంచికల్లో పొందు పరచాలి. వారిని జయంతి ఉత్సవాల్లో భాగస్వాములను చేయాలి.
  • హైదరాబాద్, ఢిల్లీ, వరంగల్, కరీంనగర్, మంథని, బరంపురం, నాగపూర్ తదితర నగరాల్లో పివి కాలం గడిపారు. ఆయా సందర్భాల్లో ఆయనతో గడిపిన వారు, ఆయనతో అనుబంధం ఉన్నవారు ఉంటారు. వారినీ భాగస్వాములను చేయాలి.
  • బిల్ క్లింటన్, జాన్ మేజర్ లాంటి వివిధ దేశాల మాజీ అధ్యక్షులు, మాజీ ప్రధానులు, మంత్రులతో కూడా పివికి అనుబంధం ఉంది. వారి అభిప్రాయాలు కూడా సేకరించాలి. వీలయితే వారిని ఉత్సవాలలో భాగస్వాములను చేయాలి.
  • పివి గొప్పతనం దేశానికంతా తెలిసేలా దేశ వ్యాప్తంగా శత జయంతి ఉత్సవాల సందర్భంగా హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలి. ఢిల్లీ, కలకత్తా, చెన్నయ్, బెంగులూరు తదితర నగరాల్లో హోర్డింగులు పెట్టాలి. హైదరాబాద్ లో కనీసం 100 చోట్ల హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలి.
  • విద్య, సాహిత్య, రాజకీయ తదితర రంగాల్లో విశేష కృషి చేసిన వారిని ప్రత్యేకంగా గుర్తించడం కోసం పివి స్మారక అవార్డు నెలకొల్పాలి. క్రమం తప్పకుండా అవార్డులు ఇవ్వాలి.
  • విద్యాసంస్థలు పునఃప్రారంభం అయిన తర్వాత విద్యార్థులను భాగస్వాములను చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి.
  • రాష్ట్రంలోని ప్రతీ ఊరికీ పివి గొప్పతనం తెలిసేలా, ప్రజలంతా పివి ఘన చరిత్రను తెలుసుకునే ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. అన్ని స్థాయిల అధికారులు, ప్రజాప్రతినిధులు అందులో భాగస్వాములు కావాలి.
  • పివి తెలుగువాడు. తెలంగాణ వాడు. జర్నలిస్టు. సాహితీవేత్త. కాబట్టి పివికి ఘనమైన అక్షర నివాళి అర్పించే విధంగా రచయితలు ప్రత్యేక రచనలు చేయాలి. కవులు పాటలు రాయాలి. పత్రికలు ప్రత్యేక వ్యాసాలు ప్రచురించాలని కోరుతున్నాను.
- Advertisement -