విద్యాసంస్థల పున:ప్రారంభింపై సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం..

150
cm kcr
- Advertisement -

అంగన్ వాడీలతో సహా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రయివేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి పున:ప్రారంభించాలని సిఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్ణయించింది. గ్రామాలు, పట్టణాల్లోని అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలను శుభ్రపరిచి ఆగస్టు 30 లోగా సానిటైజేషన్ చేయాలని పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖల మంత్రులు, అధికారులను సిఎం ఆదేశించారు. కరోనా నేపథ్యంలో మూసివేసిన విద్యాసంస్థలను పున: ప్రారంభించే అంశంపై సోమవారం ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘ కరోనా కారణంగా రాష్ట్రంలోని విద్యావ్యవస్థ ఇబ్బందుల్లో పడింది. విద్యా సంస్థలు మూతపడడంతో విద్యార్థులు తల్లిదండ్రులు సహా ప్రయివేట్ స్కూల్ టీచర్లు తదితర విద్యా అనుబంధ రంగాల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఆయా ప్రభుత్వాలు విద్యాసంస్థల పున: ప్రారంభానికి తీసుకుంటున్న చర్యలను, అనుసరిస్తున్న వ్యూహాలను కూడా సమావేశంలో క్షుణ్ణంగా చర్చించాం. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరిస్థితుల పై రాష్ట్ర వైద్యశాఖ అధికారులతో చర్చించాం. గతం కంటే రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి వచ్చిందని వారు నివేదికలు అందించారు. ప్రస్థుతం రాష్ట్రంలో కూడా జన సంచారం మామూలు స్థాయిలోకి వస్తున్నది. అదే సందర్భంలో విద్యాసంస్థలను నిరంతరాయంగా మూసివేయడంతో విద్యార్ధినీ విద్యార్థుల్లో ముఖ్యంగా స్కూలు పిల్లల్లో మానసిక వత్తిడి పెరిగుతున్నదని, అది వారి భవిష్యత్తు పై ప్రభావం చూపే పరిస్థితి వున్నదనే అధ్యయనాన్ని వైద్యశాఖ అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో కెజి నుంచి పీజీ దాకా, ప్రయివేట్ ప్రభుత్వ విద్యా సంస్థల్లో అన్ని రకాల విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధినీ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని, అన్ని రకాల పూర్వాపరాలు పరిశీలించిన మీదట, సమావేశంలో పాల్గొన్న అందరి అభిప్రాయాలను తీసుకుని ,పలు జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని రకాల విద్యాసంస్థలను సెప్టెంబర్ 1 నుంచి పున: ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.’’ అని సిఎం కెసిఆర్ తెలపారు.

పంచాయితీ రాజ్ మున్సిపల్ శాఖలదే బాధ్యత :
ఇన్నాల్లూ పాఠశాలలు మూతబడి వుండడం మూలాన, గ్రామాలు పట్టణాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో పారిశుధ్యాన్ని తిరిగి సాధారణ స్థాయికి తెచ్చే బాధ్యతను పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖలు తప్పనిసరిగా తీసుకోవాలని సిఎం స్పష్టం చేశారు. పాఠశాలలు విద్యాసంస్థల ఆవరణలు పరిశుభ్రంగా పెట్టే బాధ్యత ఆయా గ్రామాల్లోని సర్పంచులు, మున్సిపల్ చైర్మన్ లదేనని సిఎం పునరుద్ఘాటించారు. మరో వారం రోజుల్లో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆగస్టు నెలాఖరుకల్లా ప్రత్యేక శ్రద్ధతో మరుగుదొడ్లతో సహా, విద్యాసంస్థల ఆవరణలను సోడియం క్లోరైడ్, బ్లీచింగ్ పౌడర్ వంటి రసాయనాలతో పరిశుభ్రంగా తయారు చేయాలన్నారు. విద్యాసంస్థల పరిధిల్లోని నీటి ట్యాంకులను తేటగా కడిగించాలన్నారు. తరగతి గదులను కడిగించి సానిటైజేషన్ చేయించాలని సర్పంచులు మున్సిపల్ చైర్మన్లను సిఎం ఆదేశించారు.ఇందుకుగాను జిల్లా పరిషత్ చైర్మన్లు వారి వారి జిల్లాల్లో, మండలాధ్యక్షులు వారి వారి మండలాల్లో పర్యటించి అన్ని పాఠశాలలు సానిటైజేషన్ చేసి పరిశుభ్రంగా వున్నయో లేవో పరిశీలించాలన్నారు. ఈ విషయాన్ని జిల్లాల డిపీవోలు, జెడ్పీ సీఈవోలు, ఎంపీవోలు, ఎంపీడీవోలు, డిపీవోలు, ఎంపీవోలు ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్దారించాల్సిన బాధ్యతతీసుకోవాలన్నారు. ఈ నెల 30 తేదీలోపల ఎట్టి పరిస్థితుల్లో అన్నిరకాల ప్రభుత్వ విద్యాసంస్థల సానిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.

విద్యార్థుల పట్ల జాగ్రత్తలు :
విద్యాసంస్థలు తెరిచిన తర్వాత స్కూల్లల్లోని విద్యార్థినీ విద్యార్థులకు జ్వర సూచన వుంటే ఆయా స్కూల్ల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ వెంటనే అతి సమీపంలోని పిహెచ్ సీ కి తీసుకువెల్లి కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని సిఎం తెలిపారు. వొక వేల కోవిడ్ నిర్దారణ అయితే సదరు విద్యార్థినీ విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించాలని సిఎం సూచించారు. హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులు సానిటైజేషన్ చేసుకోవడం, మాస్కులను విధిగా ధరించడం వంటి కోవిడ్ నియంత్రణా చర్యలను విధిగా పాటించాలన్నారు. ప్రతి రోజు తమ పిల్లలకు మాస్కులు ధరించేలా, తదితర కోవిడ్ నియంత్రణ విధానాలను పాటించేలా చూసుకోవాలని, తమ పిల్లలను విద్యాసంస్థలకు పంపుతున్న తల్లిదండ్రులను సిఎం కెసిఆర్ కోరారు.

ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపి కె. కేశవరావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీ ఎస్ సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం సెక్రటరీలు స్మితా సభర్వాల్, రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, పంచాయతీ రాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ, సీఎం ఓఎస్డీలు గంగాధర్, ప్రియాంక వర్ఘీస్, టిఎస్ డబ్ల్యుఆర్ఈఐఎస్ కార్యదర్శి రొనాల్డ్ రోస్, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దేవసేన, కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సయ్యద్ ఉమర్ జలీల్, హెల్త్ డైరక్టర్ శ్రీనివాస రావు, డైరక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, టిఎస్ఎంఎస్ ఐడిసి ఎండి చంద్రశేఖర్ రెడ్డి, ఓఎస్డీ పంచాయతీ రాజ్ సత్యనారాయణ రెడ్డి, టిఎంఆర్ఈఐఎస్ కార్యదర్శి షఫీ ఉల్లా తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -