తెలంగాణ నలుదిక్కుల్లో దళితబంధు..

152
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా వున్న దళితుల మనోభావాలు, వారి ఆర్థిక అవసరాలు, వారి స్థితిగతులు పరిశీలించడం ద్వారా విజయవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో దళితబంధు పథకాన్ని తెలంగాణ నలుదిక్కుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దళితులను ఆర్థికంగా అభివృద్ధి పరి, వారిని వ్యాపార వర్గంగా నిలబెట్టి, తర తరాలుగా వారిని వెంటాడుతున్న ఆర్థిక సామాజిక వివక్షను బద్దలు కొట్టాలనే అత్యున్నత ఆశయంతో, సామాజిక బాధ్యతతో నిర్దిష్టమైన లక్ష్యంతో దళిత బంధు పథకాన్ని అమలు లోకి తెచ్చామని సీఎం పునరుద్ఘాటించారు.

హుజూరాబాద్, వాసాలమర్రితో సహా తెలంగాణలో తూర్పుదిక్కున వున్న మధిర నియోజకవర్గంలో చింతకాని మండలం, ఉత్తర దిక్కున తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలం, దక్షిణ దిక్కులో అచ్చం పేట -కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, పశ్చిమాన జుక్కల్ నియోజక వర్గంలోని నిజాం సాగర్ మండలం, ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామని సిఎం తెలిపారు. దళితబంధు పథకాన్ని ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న వాసాలమర్రి, హుజూరాబాద్ లలో ప్రకటించిన విధంగా నిధులను విడుదల చేసామన్నారు. నాలుగు జిల్లాలకు చెందిన నాలుగు మండలాల్లో కూడా రెండు మూడు వారాల్లోనే దశలవారీగా నిధులు విడుదల చేస్తామని సిఎం ప్రకటించారు. ఈ మండలాలకు చెందిన అధికారులు గ్రామాలకు తరలాలని సీఎం స్పష్టం చేశారు.

‘‘దళితబంధు పథకం దేశంలోనే మునుపెన్నడూ, ఎవరూ చేయని వినూత్నఆలోచన. ఈ పథకానికి రూపకర్తలం, కార్యకర్తలం మనమేనన్నారు. పథకాన్ని విజయవంతం చేయడం ద్వారా దేశ దళిత జాతి అభ్యున్నతికి బాటలు వేసినవారమౌతామని సిఎం అన్నారు. తెలంగాణ ఉద్యమం కూడా వివక్షకు వ్యతిరేకంగానే సాగిందని, దళితబంధును ఉద్యమంగా అమలు చేయడంలో తెలంగాణ ఉద్యమ స్పూర్తే ఇమిడి వున్నదని సిఎం తెలిపారు.

సోమవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు అధ్యక్షతన, రాష్ట్రం నలుమూలల్లోని నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలు – అత్యున్నత స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాలుగు మండలాలకు చెందిన జిల్లాల మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ,ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ కులాల సంక్షేమం అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, నల్లగొండ జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, నిజామాబాద్ జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిశోర్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే, ఎంపీ, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, సీనియర్ దళిత రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు లింగాల కమల్ రాజ్, డి.శోభ, పి.పద్మావతి బంగారయ్య, జి.దీపిక, పాల్గొన్నారు.

అధికారులు: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం. ఓఎస్డి ప్రియాంక వర్ఘీస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్, రామకృష్ణారావు, ఎస్సీ డెవలప్ మెంట్ కార్యదర్శి, సిఎం సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఎస్సీ కార్పోరేషన్ ఎండి పి. కరుణాకర్, టిఎస్ఎస్ ఎండి జీ.టి. వెంకటేశ్వర్ రావు, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి.కణ్ణన్, ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్, సూర్యాపేట్ కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, జితేష్ వి.పాటిల్, పి. ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎం కేసిఆర్ మాట్లాడుతూ ‘‘దళితబంధుకు రూపకల్పన అసెంబ్లీ సాక్షిగా జరిగింది. దళిత ఎంపవర్ మెంట్ కింద 1000 కోట్ల రూపాయలను కూడా నేనే స్వయంగా అసెంబ్లిలో ప్రకటించిన. వివిధ పార్టీలు, వివిధ రంగాలకు చెందిన దళిత పెద్దలు, మేధావులతో దఫాధఫాలుగా చర్చించిన తర్వాత దళితబంధు కార్యక్రమానికి అమలు రూపకల్పన జరిగింది. ఎదైనా మండలాన్ని లేదా నియోజకవర్గాన్ని సంపూర్ణంగా తీసుకుంటే బాగుంటుందని సలహాలు, సూచనలు వచ్చాయి, అందులో భాగంగానే హుజూరాబాద్ లో దళితబంధు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యింది. ఇదేదో రోటిన్ వ్యవహారం కాదు.. గతంలో ఏ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయని కార్యక్రమం ఇది..’’ అని సిఎం తెలిపారు.

కశ్మీర్ నుండి కన్యాకూమారి దాకా వివక్ష, ఆర్తి, బాధతో వున్న వర్గం ఎదైనా వుందంటే అది దళిత జాతేననే విషయాన్ని అనేక జాతీయ అంతర్జాతీయ కంపేరిటివ్ స్టడీలు నివేదికలు అందించాయని సిఎం అన్నారు. స్వాతంత్ర్యానంతరం అరకొర అభివృద్ధి తప్పితే, దళిత గూడాల్లో గుణాత్మకమైన మార్పు ఇంకా రాలేదన్నారు. ఒక కుటుంబంలో ఎవరికైనా ఆపదవస్తే ఎట్లైతే ఆదుకుంటామో అదే స్పూర్తితో దళితులను యావత్ సమాజం బాగు చేసుకోవాల్సిన బాధ్యత వుందని సిఎం అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్దారించుకుని అమలు చేస్తున్న పథకం దళితబంధు అని సిఎం స్పష్టం చేశారు. ఎక్కడైతే వివక్ష విపరీతంగా వుంటుందో అక్కడ మేలుకొలుపు వుంటుందని, అట్లా చైతన్యం పొందిన వారే పోరాటం చేసి 100 శాతం విజయాన్ని సాధిస్తారని సిఎం తెలిపారు. తాను మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభించడం కన్నాముందే ఇదే విషయాన్ని 1996 లో ఎస్ఆర్ఎస్పీ కాలువమీద ప్రజలతో స్పష్టం చేశానన్నారు. అనుకున్నట్లే వివక్షకు గురైన నాటి తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించి విజయాన్ని సాధించామని సిఎం తెలిపారు. స్వరాష్ట్రంలో అనేక రంగాల్లో దేశం గర్వించదగ్గ అభివృద్ది సంక్షేమం సాధించామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇదే ఉద్యమ స్పూర్తిని దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకం ద్వారా కొనసాగించాలన్నారు. ఎదైనా ఒక్కరోజుతోనే సాధ్యం కాదని దశలవారీగా విజయాన్ని చేరుకుంటామన్నారు. దశలవారిగా రాష్ట్ర వ్య్మాప్తంగా బడ్జెట్ లోనిధులు కేటాయించుకుని పథకాన్ని అమలు చేస్తామన్నారు.

పేరంటల్ అప్రోచ్ వుండాలే : దళితుల అభ్యున్నతి కోసం అధికారులు పేరంటల్ అప్రోచ్ తో పనిచేయాలని సిఎం అన్నారు.ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాల వివక్షకు గురవుతూ అన్ని రంగాల్లో వెనుకబడిన దళితులను దళితబంధు పథకం ద్వారా తల్లిదండ్రుల్లాగా ఆదుకోవాలన్నారు. వారితో అధికార దర్పంతో కాకుండా కన్నబిడ్డను ఎట్లైతే తల్లిదండ్రలు ఆలనా పాలనా చూస్తారో ఆ పద్దతిలో వ్యవహరించాలన్నారు. సమన్వయకర్తల్లాగా కలిసి పనిచేయాలన్నారు. దళితుల్లో ఈ సందర్భంగా ఒక విశ్వాసాన్ని పాదుకొల్పాన్నారు. అధికారులు దళితుల అభివృద్ధి కోసం లీనమై రసించి పనిచేయాలన్నారు. దళితుబంధు పథకాన్ని తన భూజాలమీద మోయాల్సిన సమయం విద్యావంతులైన దళిత యువతకు ఆసన్నమయిందన్నారు. దళిత యువతను ఈ పథకంలో భాగాస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. ఈ పథకంలొ సపొర్టు స్ట్రక్చర్ ఏర్పాటు చేయడం గొప్పవిషయమన్నారు. ఇందుకోసం రక్షణ నిధిని ఎర్పాటు చేసిన విషయం సిఎం వివరించారు.

వ్యాపార ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ : ప్రభుత్వం లైసెన్సులు కేటాయించే వివిధ రంగాలను గుర్తించి అందులో అర్హులైన దళితులకు రిజర్వేషన్ ఏర్పాటు చేయనున్నట్లు సిఎం కేసిఆర్ పునరుద్ఘాటించారు. మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, మీసేవా కేంద్రాలు, గ్యాస్ డీలర్షిప్పులు, ట్రాన్స్ పోర్టు పర్మిట్స్, మైనింగ్ లీజులు, సివిల్ కాంట్రాక్టర్స్, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్, బారు, వైన్ షాపులు తదితర రంగాలద్వారా ఉపాధి పొందే విధంగా, దళితబంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ‘‘అన్ని విధాలుగా దళిత కుటుంబం బాగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం’’ అని స్పష్టం చేశారు.

దళితుల కోసం చాలా పథకాలు పెట్టి, వారినే అభివృధ్ది చేస్తున్నారని సమాజంలో జరుగుతున్న చర్చ ఒక దుష్ప్రచారమేననని సిఎం స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర్నుంచి అంబెడ్కర్ మహాశయుడు తీసుకువచ్చి అందించిన ఫలాలు తప్పితే దళితుల జీవితాల్లో గుణాత్మకమైన మార్పేమి జరుగలేదన్నారు. దళితబంధు పథకం అమలు తీరు అందుకు అనుసరించాల్సిన పథ్దతులు, విధి విధానాలు గురించి అధికారులు వివరించారు. మొదటిదశలో పథకం అమలు పటిష్టంగా జరగాలన్నారు. రెండవ దశలో పథకం పర్యవేక్షణ కీలకమన్నారు. దీనికి గాను జిల్లా కలెక్టర్లు, దళితబంధు కమిటీలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి లబ్దిదారుని కుటుంబానికి ప్రత్యేక దళితబందు బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో దళితబంధు కమిటీలు వుంటాయని సిఎం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కమిటీల ద్వారా లక్షకు పైగా దళిత బిడ్డలు దళిత జాతి సంరక్షణను తమ భుజాలమీద వేసుకొని నిర్వహించనున్నారని సిఎం పేర్కోన్నారు.

తమ జాతి అభివృద్ధికి తామే స్వయంగా భాగాస్వాములను చేయడం ఈ పథకం గొప్పతనమన్నారు. ఈ కమిటీల నుంచి ఎన్నిక కాబడిన వారే రీసోర్సపర్సన్లుగా పనిచేస్తారన్నారు. పథకాలను ఎంచుకునే క్రమంలో పునరావృతం కాకుండా,లాభసాటిగా వుండేలా చూసుకోవాలన్నారు. అశావహ దృక్పథానికి బాటలు వేస్తేనే చక్కటి తెలంగాణ అభివృద్ధికి బాటలు పడతాయని సిఎం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని విస్మరించలేదన్నారు. బ్రాహ్మణులు తదితర అగ్రకులాల్లోని పేదలను గుర్తించి వారిని అభివృద్ధి పరిచే కార్యక్రమాలను అమలు పరుస్తున్నామన్నారు. కులం మతం అనే తేడా లేకుండా రైతుబందు పథకాన్ని అన్ని వర్గాలకు అమలు చేస్తున్నామని సిఎం అన్నారు. ఒక్కొక్క రంగాన్ని వర్గాన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్నరాష్ట్ర ప్రభుత్వం, నేడు దళితుల అభ్యున్నతే లక్ష్యంగా చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే దళితబంధు అమలుకోసం ప్రయోగాత్మకంగా నాలుగు మండలాలను ఎంపిక చేశామన్నారు. ‘‘ దళిత జాతి అభివృద్దిలో మీరు చాలా గొప్ప పాత్రను పోషిస్తారని ఆశిస్తున్నా’నని, సమావేశంలో పాల్గొన్న నాలుగు జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులనుద్దేశించి సిఎం అన్నారు.

అధికార దర్పంతో కాకుండా సమన్వయకర్తలుగా, కార్యకర్తలుగా పనిచేయాలని అధికారులకు సూచించారు. అభివృద్ధిని సాధించి తీరుతామని తనకు విశ్వాసం వుందన్నారు. దళితబంధు ద్వారా అందించే ఆర్థిక సహాయం బ్యాంకు లోను కాదు. తిరిగి చెల్లించాల్సిన పని లేదు. ఇది ఫలానా పనిచేయాలనే వొత్తిడి లేదు. వచ్చిన పని, నచ్చిన పనిని చేసుకోవచ్చనే విషయాలను క్షేత్ర స్థాయిలోప్రజలకు అవగాహన కల్పించాలని సమావేశంలోని అధికారులకు సిఎం స్పష్టం చేశారు.

ఇప్పటికే దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలవుతున్న నేపథ్యంలో, క్షేత్ర స్థాయి అనుభవాలను సమావేశానికి వివరించాల్సిందిగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్ ను సిఎం ఆదేశించారు. సిఎం ఆదేశాల మేరకు దళితబంధు అమలు తీరు తెన్నులను కలెక్టర్ వివరించారు. క్షేత్ర స్థాయిలో పథకం పట్ల తమకు సానుకూలంగా అద్భుతమైన స్పందన వచ్చిందని కలెక్టర్ వివరించారు. ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరయిన కరీంనగర్ జిల్లా కలెక్టర్, దళిత ప్రజల మనోభావాలను, అధికార యంత్రాంగం అనుభవాలను సమావేశానికి వివరించారు.

ఈ సందర్భంగా ఎంపిక కాబడిన మండలాల నియోజకవర్గాల జిల్లాల మంత్రులు ఎమ్మెల్సీ , ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధుల సలహాలు సూచనలను సిఎం కెసిఆర్ సేకరించారు. దళిత బంధు పథకం ద్వారా దళిత జాతిని ఆర్థికంగా నిలదొక్కుకునే దిశగా నడిపించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వక్తలు అభిప్రాయ పడ్డారు. సీఎం కేసిఆర్ చేపట్టిన దళిత బంధు పథకం,దళితులను వ్యాపార వర్గంగా మలుస్తుందని సమావేశం విశ్వాసం వ్యక్తం చేసింది. సీఎం ఆలోచనలకు అనుగుణంగా తాము దళిత బంధు విజయవంతానికి క్షేత్ర స్థాయిలో కృషి చేస్తామని సమావేశం లో పాల్గొన్న అధికారులు తెలిపారు .

- Advertisement -