గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలి.. కేసీఆర్‌

289
CM KCR
- Advertisement -

పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తితో గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రగతి సాధనలో క్రియాశీల పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గ్రామీణాభివృద్ధికి పంచాయతీ రాజ్ ఉద్యమం, సహకారం ఉద్యమం ఎంతగానో దోహదపడ్డాయని, ఆ ఉద్యమానికి పూర్వ వైభవం రావాలని చెప్పారు. నిర్ధేశిత లక్ష్యాలను ఛేదించి, గ్రామాల వికాసానికి కృషి చేయడంలో అగ్రగామిగా నిలిచిన జిల్లా పరిషత్ లకు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రగతినిధి నుంచి రూ.10 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలోని అన్ని గ్రామాలు గంగదేవిపల్లి, ముల్కనూర్, అంకాపూర్ లాంటి ఆదర్శ గ్రామాల మాదిరిగా మారాలని సిఎం ఆకాంక్షించారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, వైస్ చైర్మన్లకు త్వరలోనే హైదరాబాద్ లో శిక్షణా కార్యక్రమం నిర్విస్తామని ప్రకటించారు. గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రతతో వర్థిల్లాలనే ప్రధాన లక్ష్యంతో రూపొందించిన కొత్త పంచాయతీ రాజ్ చట్టం అమలులో క్రియాశీల పాత్ర పోషించాలని కోరారు.

CM KCR

కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. పంచాయతీ రాజ్ సంస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను, ప్రజాప్రతినిధుల బాధ్యతలను ముఖ్యమంత్రి కూలంకశంగా వివరించారు.

ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..రాష్ట్రంలోని అన్ని గ్రామాలు గంగదేవిపల్లి, ముల్కనూర్, అంకాపూర్ లాంటి ఆదర్శ గ్రామాల మాదిరిగా మారాలని దిశానిర్దేశం చేశారు. విజయాలు, అపజయాలు సర్వసాధారణం. రాజకీయాల్లో ఉన్నవారు ప్రజలతో నిత్యసంబంధాలు కలిగి ఉండడం ప్రాథమిక లక్షణం. గతంలో జడ్పీ చైర్మన్లకు పెద్దగా పనిలేదు. ఇటీవల కేంద్ర ఆర్థిక సంఘాన్ని కలిసినపుడు మన వ్యవస్థ గురించి వివరించాను. జడ్పీ చైర్మన్లకు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ర్యాంక్ ఇచ్చామని చెప్పిన. వాళ్లు ఇకముందు క్రియాశీలకంగా పనిచేస్తారని కూడా చెప్పానని సీఎం తెలిపారు. ఇంత ఏకపక్షంగా 32 జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ రాలేదని సీఎం కేసీఆర్ అన్నారు.

పంచాయతీరాజ్ ఒక అద్భుతమైన ఉద్యమం. స్వాతంత్ర వచ్చిన ఆరంభ రోజుల్లో దీన్ని రూపకల్పన చేశారు. రాష్ట్రాలకు పాలనలో స్వాతంత్య్రం ఉండాలని.. కేంద్రీకృతపాలన క్షేత్రస్థాయిలో ఫలితాలు రాబట్టలేదు. ఎక్కడికక్కడే అభివృద్ధి జరగాలని ఒక అద్బుతమైన ఉద్యమానికి ప్రాణం పోశారు. దీనికి మొట్టమొదటి పేరు కమ్యూనిటీ డెవలప్ మెంట్. అది వికేంద్రీకరణ జరగాలని స్థానిక స్వపరిపాలనకు శ్రీకారం చుట్టారు. పంచాయతీరాజ్ విషయంలో అవగాహనకు రావడానికి నేను ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఎన్ఐఆర్డీలో శిక్షణకు వెళ్లాను. అక్కడే హాస్టల్ లో ఉండి 7 రోజుల శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యాను. అలా వెళ్లడం వల్ల నాకు పూర్తి అవగాహన వచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు.

సమావేశం ప్రారంభం కావడానికి ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పరిషత్ చైర్మన్లను, వైస్ చైర్మన్లను వారి స్థానాల దగ్గరికి పోయి కలిసి, ప్రతి ఒక్కరినీ పేరు-పేరునా అభినందించారు. వారందరితో కలిసి భోజనం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు సునీతా మహేందర్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎ.జీవన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, షకీల్, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, నల్లాల ఓదేలు, ఉమా మాధవరెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -