రైతులకు సీఎం కేసీఆర్‌ తీపి కబురు..

55
- Advertisement -

రాష్ట్రంలో ఇటీవల కురిసిన ఆకాల వర్షాలకు తడిసిన వరిధాన్యాన్ని కూడా కొంటామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని సీఎం అన్నారు. బుధవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశం రాష్ట్రంలో జరుగుతున్న వరిధాన్య సేకరణపై సీఎం సమీక్షించారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో ధాన్య సేకరణ వేగవంతం చేయాలన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వరిధాన్యం సేకరణపై సీఎం ఆరాతీసారు. ధాన్యం తూకం, గన్నీ బ్యాగులు, రవాణ, మిల్లుల్లో దిగుమతి తదితర వరిధాన్య సేకరణ ప్రక్రియ గురించి సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 56 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 20 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించామని అధికారులు సీఎంకు తెలిపారు.

అకాల వర్షాల కారణంగా అక్కడక్కడ వరిధాన్యం తడుస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నదని, తడిసిన ధాన్యాన్ని ఎంత ఖర్చైన రాష్ట్ర ప్రభుత్వమే భరించి చివరి గింజ వరకు కొంటుందని సీఎం స్పష్టం చేశారు. కేంద్రం కొన్నా కొనకున్నా బాయిల్డ్ రైస్‌ను ఖర్చుకు వెనకాడకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం మరోసారీ స్పష్టం చేశారు.

- Advertisement -