బండి, రేవంత్‌లకు ఊహించని షాక్..

119
- Advertisement -

అపర చాణక్యుడు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మరోసారి ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఊహించని షాక్ ఇచ్చారు. తెలంగాణలో గత కొంత కాలంగా సీఎం కేసీఆర్ 2022లో ప్రభుత్వాన్ని రద్దు చేసి , మళ్లీ ముందస్తు ఎన్నికలకు వెళతారని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గత్తరలేపుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లతో సహ ఆ పార్టీల నేతలు ఇంకా ఎన్నికలకు రెండేళ్లకు పైగా సమయం ఉన్నా ఇప్పటి నుంచే సంగ్రామయాత్రలు, జంగ్‌సైరన్‌లు అంటూ ఎన్నికల భేరీలు మోగిస్తున్నారు. అయితే అనూహ్య నిర్ణయాలతో రాజకీయ ప్రత్యర్థులను చావు దెబ్బ కొట్టే గులాబీ బాస్ మరోసారి ముందస్తు ఎన్నికలపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని, ఫుల్ టర్మ్ పవర్‌లో ఉంటామని, మళ్లీ ఎన్నికల్లో గెలిచేది కూడా మేమే అంటూ తేల్చి చెప్పారు. దీంతో రేవంత్ అండ్ కో, బండి బ్యాచ్‌కు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయినట్లైంది. ఇటీవల తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సీఎం కేసీఆర్‌ ఉమ్మడి సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.. ఈ సందర్భంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలు, ముందస్తు ఎన్నికలపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో మనమే కీలకపాత్ర పోషించే స్థాయికి ఎదుగుతాం. అందులో ఎవరికీ అనుమానం అక్కరలేదు. గతంలో అక్కడక్కడా చిన్నచిన్న పొరపాట్లు జరగడం వల్ల కొన్ని సీట్లు కోల్పోయాం. ఈసారి ఆ ప్రసక్తే ఉత్పన్నం కానివ్వం అని కేసీఆర్ స్పష్టం చేశారు. అలాగే ముందస్తు ఎన్నికలపై గత కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారంపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. గత ఎన్నికలకు ముందు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగితే తమకు కలిగే నష్టాన్ని అంచనా వేసినందువల్లే ముందస్తుకు వెళ్లినట్లు తెలిపారు. రాజకీయంగా అప్పటి పరిస్థితుల గురించి తెలిసినందునే ఆ నిర్ణయం తీసుకున్నామని, ఈసారి ఆ అవసరం లేదన్నారు. గతంలో మాదిరిగా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదు. మన ప్రభుత్వానికి ఇంకా రెండున్నరేండ్ల సమయం ఉన్నది. ఈలోపు మనం చేయాల్సిన పనులున్నాయి. వీటిని పూర్తి చేసుకుందాం. అనేక కష్టాలు పడి, అవమానాలు ఎదుర్కొని, ఇవాళ ఈ స్థాయికి వచ్చాం. ప్రజల దీవెనలతో దీన్ని ఇలాగే కాపాడుకొంటూ ముందుకు సాగుదాం. మనల్ని కొట్టే శక్తి ఎవరికీ లేదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. మొత్తంగా ఎప్పుడెప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తాయా..ఎప్పుడెప్పుడు సీఎం కుర్చీ ఎక్కేద్దామా అంటూ కలలు కంటున్న ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు సీఎం కేసీఆర్ నిర్ణయం దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

- Advertisement -