దేశం గర్వించే రీతిలో ఫారెస్ట్ యూనివర్సిటీ- సీఎం కేసీఆర్

566
- Advertisement -

సొంత నియోజకవర్గం గజ్వేల్‌ పర్యటనలో భాగంగా ములుగులో నూతనంగా నిర్మించిన అటవీ కళాశాల, పరిశోధన కేంద్రాన్ని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ప్రారంభించారు. ముందుగాపైలాన్ ఆవిష్కరణ తర్వాత కళాశాల ఆవరణలో సీఎం కేసీఆర్ మొక్క నాటారు. ఈ సందర్భంగా కళాశాలలోని సిబ్బంది, విద్యార్థులతో సీఎం ముచ్చటించారు. కాలేజీ విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పిన సీఎం బాగా చదివి అటవీ నిపుణులుగా తయారుకావాలని ఆకాంక్షించారు. ఆ తర్వాత గజ్వెల్ మహతి ఆడిటోరియంలో మాట్లాడిన సీఎం,అటవీ కాలేజీ,హరితహారం,అటవీ పునరుద్ధరణ విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫారెస్ట్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. తమిళనాడులోని మెట్టుపలాయం ఫారెస్ట్ కాలేజీ దేశంలోనే అత్యధిక సంఖ్యలో 120 మంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారులను అందించింది. అంతకంటే ఎక్కువమంది ఐఎఫ్‌ఎస్‌లను తెలంగాణ నుంచి తయారుచేసేందుకు వీలుగా దేశం గర్వించే రీతిలో ఫారెస్ట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని భావించామని, అందుకు అనుగుణంగా ములుగులో ఫారెస్ట్ కాలేజీ రూపుదిద్దుకున్నదని సీఎం తెలిపారు. తన కార్యాలయంలో ఓ ఎస్ స్డీ (ఓఎస్‌డీ)గా పనిచేస్తున్న ప్రియాంక వర్గీస్, ఆమె భర్త ఇద్దరూ మెట్టు పలాయం కాలేజీలో చదివి ఐఎస్‌ఎఫ్‌ అధికారులు అయ్యారని, తెలంగాణ విద్యార్థులు అలా ఎంపిక కావాలన్నది తమ ఆశయం అన్నారు.

CM KCR

అదేవిధంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమం స్ఫూర్తిని ప్రతీ ఒక్కరూ కొనసాగించాలని సీఎం కోరారు. మొక్కలు నాటుతూ,వాటిని రక్షించాలన్నారు. రాబోయే తరాలకు ఆస్తులకంటే, నివాసయోగ్యమైన వాతావరణం ఇద్దామని ముఖ్యమంత్రి తెలిపారు. అటవీశాఖ ద్వారా అటవీ పునరుద్ధరణ పనులు చాలా బాగా కొనసాగు తున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ రిజర్వాయర్ చుట్టూ ఉన్న అటవీ ప్రాంతంలో పునరుద్ధరణ పెద్దఎత్తున జరగాలని సమావేశంలో ఉన్న పీసీసీఎఫ్‌ ఆర్.శోభను సీఎం కోరారు.

అటవీ కళాశాల మరిన్ని వివరాలు..

ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఫారెస్ట్ కాలేజీని పూర్తిస్థాయి లేదా డీమ్డ్ యూనివర్సిటీగా హోదా పెంచడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. 2016 నుంచి దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో తాత్కాలికంగా కొనసాగుతున్న బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులు ములుగు నూతన క్యాంపస్‌లోకి మారనున్నాయి. 2020 నుంచి ఎమ్మెస్సీ, పీహెచ్‌డీతో పాటు ఏకకాలంలో ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ కోర్సులను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఫారెస్ట్ కాలేజీ పరిపాలనా భవనాన్ని దాదాపు 12 ఎకరాల పరిధిలో,రెండు లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించారు. దీని నిర్మాణానికి ప్రభుత్వం రూ.75 కోట్లు మంజూరుచేసింది.

CM KCR

గజ్వేల్ నియోజవకవర్గం నర్సంపల్లి ఫారెస్ట్ బ్లాక్‌లో సువిశాల ప్రాంతంలో పరిపాలనా విభాగం, తరగతి గదులు, సెమినార్ హాల్స్, ల్యాబ్‌లు, హాస్టళ్లు, క్యాంటీన్‌లు, ఆడిటోరియం,రైతు హాస్టళ్లు,గెస్ట్‌హౌస్‌లు, పరిశోధనా విభాగాలను ఏర్పాటుచేశారు. అటవీవనరులు, అటవీ ఉత్పత్తుల యాజమాన్యం, వాటి వాడకం, అటవీ సాంఘిక శాస్త్రం, సామాజికశాస్త్రంతో పాటు వన్యప్రాణి శాస్త్రం, పట్టణాల్లో అడవుల పెంపకం, సుందరీకరణ, సిల్వికల్చర్ విధానాలపై వివిధ విభాగాలుంటాయి.

ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్త, సీఎం స్పెషల్ సెక్రెటరీ భూపాల్ రెడ్డి, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ రాజేశ్వర్ తివారి, ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ ఆర్.శోభ, అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -