చంద్రబాబు నయవంచకుడు, ద్రోహి

217
cm kcr on chandrababu
- Advertisement -

టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై సీఎం కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవాళ నల్గొండ జిల్లాలో జరిగిన టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ చంద్రబాబు తెలంగాణపై ఇప్పటికే ఎన్నో కుట్రలకు పాల్పడ్డాడని, తెలంగాణపై ఇంకా విషాన్ని చిమ్ముతున్నాడే ఉన్నాడని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడిన నాడు అనేక సంక్షోభాల్లో ఉందని, అటువంటి సమయంలో చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తూ తెలంగాణపై బురద జల్లే ప్రయత్నం చేశాడని, అయినా తాము ఓపికతో, నిబద్ధతతో తెలంగాణలో కరెంటు కోతలు లేకుండా చేశామని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిరంతరాయంగా 24 గంటల పాటు నాణ్యమైన కరెంటును అందిస్తున్నామని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

దేశంలో 24 గంటల పాటు కరెంటు ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక్క తెలంగాణ రాష్ట్రమేనని, త్వరలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లా నీళ్లను అందిస్తామని, మిషన్‌ భగీరధ పనులు ఇప్పటికే పూర్తి దశకు చేరకున్నాయని, త్వరలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందిస్తామన్నారు సీఎం కేసీఆర్‌. చంద్రబాబు రెండు రాష్ట్రాలు వేరై 5 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా తెలంగాణపై కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నాడని, బిడ్డా చంద్రబాబు నువ్వు ఇప్పటికే తెలంగాణ దెబ్బ ఏంటో చూసినవ్‌. తెలంగాణ ప్రజల దెబ్బకు హైదరాబాద్‌ నుండి భయపడి విజయవాడకు పారిపోయినవ్‌. నేను మూడో కన్ను తెరిస్తే నీ గతి ఏమైతుందో తెలుసుకో.. తెలంగాణలో కొత్త బిచ్చగాళ్ల లెక్క కాంగ్రెస్‌, టీడీపీ పార్టీలు పొత్తుకుని ప్రజలను మరొక సారి మోసం చేయడానికి నయవంచకుల్లా వస్తున్నారు.

ప్రజలు ఆలోచించాలని, కాంగ్రెస్‌, టీడీపీ పార్టీల మాటలను నమ్మొద్దని, కాంగ్రెస్‌ నాయకులు సిగ్గులేకుండా తెలంగాణకు అడ్డుపడ్డ చంద్రబాబుతో పొత్తుపెట్టుకుని దద్దమ్మల్లాగా చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు సీఎం కేసీఆర్‌. చంద్రబాబు నయవంచకుడు, ద్రోహి. చంద్రబాబు నంగనాచి మాటలు మాట్లాడుతున్నారని, చంద్రబాబు కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొట్టాలని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

- Advertisement -