పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తెలంగాణ ఆదర్శం- సీఎం కేసీఆర్

182
kcr
- Advertisement -

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగినపుడే, ప్రజల సహకారంతోనే పాలనావ్యవస్థ ప్రగతిపథంలో ముందడుగు వేస్తుందని సిఎం అన్నారు. స్వాతంత్ర్యానంతర భారత దేశంలో ప్రజలను పాలనలో భాగస్వాములను చేయాలనే మహోన్నత లక్ష్యంతో నాటి సోషల్ ఇంజనీర్‌గా ప్రసిద్ది పొందిన సురీందర్ కుమార్ డే (ఎస్.కె.డే) పంచాయతీరాజ్ వ్యవస్థకు అంకురార్పణ చేశారన్నారు. ప్రజలు తమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే స్వయం సహకార ఉద్యమంలో భాగంగా పంచాయతీ రాజ్ వ్యవస్థ భారత దేశంలో రూపుదిద్దుకున్నదని సిఎం గుర్తు చేసుకున్నారు.

కమ్యునిటీ డెవలప్ మెంట్‌లో భాగంగా రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ది జరుగాలనే నాటి ఎస్.కె.డే ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్నదని సిఎం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం దేశ పంచాయతీరాజ్ వ్యవస్థకు ఆదర్శంగా నిలిచిందని సిఎం అన్నారు. ఎవరి గ్రామాన్ని వారే తీర్చిదిద్దుకునే విధంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ పల్లెల్లో పాలనావ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేసిందని తెలిపారు. పల్లెల అభివృద్దికిగాను ప్రతి నెలా రూ. 339 కోట్లు, పట్టణాల అభివృద్ధికి ప్రతినెలా రూ. 148 కోట్లు క్రమం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నదన్నారు.

పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం భారతదేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న పల్లె ప్రగతి పట్టణ ప్రగతి సహా ఇతర అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో పల్లెలు పట్టణాలు పరిశుభ్రంగా పచ్చదాన్ని సంతరించుకుని అభివృద్ది పథంలో నడుస్తున్నయన్నారు. దేశంలో మరే రాష్ట్రం అందుకోని విధంగా తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ కేంద్ర ప్రభుత్వ సంస్థల చేత అనేక జాతీయ అవార్డులు ప్రశంసలను అందుకుంటున్నదన్నారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం అవుతున్నదనడానికి ఈ అవార్డులు ప్రశంసలు నిదర్శనంగా నిలిచినాయని సిఎం తెలిపారు.

సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధితో పాటు గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు పథకాలు సబ్బండ వర్గాలను అభివృద్దిలో భాగస్వాములను చేస్తున్నాయన్నారు. తద్వారా నాటి ఎస్.కె.డే కలలు కన్న పంచాయతీ రాజ్ సహకార వ్యవస్థ లక్ష్యాలను సాధించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో వున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు.

- Advertisement -