కరోనా వ్యాప్తి నివారణపై సీఎం ‌ సమీక్ష..

261
cm kcr
- Advertisement -

ఆదివారం కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఈటెల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌ రావు, కార్యదర్శి రాజశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని కట్టుదిట్టంగా నియంత్రించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. రాబోయే పదిరోజుల్లో హైదరాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50వేల మందికి ముందు జాగ్రత్త చర్యగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి గుండె లాంటిది. ఎక్కువ జనాభా కలిగిన నగరం. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ ప్రజల ఆరోగ్యం, నగర ప్రగతి, నగర పేరు ప్రఖ్యాతులు సుస్థిరంగా ఉండేట్లు చూడాల్సిన బాధ్యత మనపై ఉంది.

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ, హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిరోజూ ఎన్నోకొన్ని పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీన్ని పూర్తిస్థాయిలో నివారించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రులనే కాకుండా, ప్రైవేటు లాబరేటరీలు, ఆస్పత్రులను కూడా వినియోగించుకోవాలి. ప్రైవేటు హాస్పిటళ్లలో జరిపే పరీక్షలు, చికిత్సకు అవసరమైన మార్గదర్శకాలను, ధరలను అధికారులు నిర్ణయించాలి. పాజిటివ్ గా తేలినప్పటికీ వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేనివారికి ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలి (హోం ట్రీట్ మెంట్) ’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు.

‘‘హైదరాబాద్ ను కాపాడుకోవాలనే ముందు చూపుతో మాత్రమే 50 వేల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వృద్ధులు ఇంట్లోనే ఉండాలి. ఇతర తీవ్ర జబ్బులు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండటం అవసరం. రాష్ట్రంలో ఎంతమందికి పాజిటివ్ వచ్చినప్పటికీ అందరికీ చికిత్స అందించడానికి ప్రభుత్వం సర్వ సిద్ధంగా ఉంది. టెస్టు కిట్లు, పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, బెడ్లు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు ఇలా ప్రతి విషయంలోనూ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతోపాటు, వైరస్ సోకినవారికి అవసరమైన చికిత్స అందించే విషయంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో, అప్రమత్తతతో ఉంది’’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

- Advertisement -