తక్షణ సాయం కింద నిధులు మంజూరు : సీఎం కేసీఆర్‌

68
kcr
- Advertisement -

తెలంగాణలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితులపై ఏటూరు నాగారంలో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగానికి, ప్రజా ప్రతినిధులకు అభినందనలు సీఎం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిశాఖ అధికారులు మూడు షిఫ్టులు పని చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను దశలవారీగా ఎత్తయిన ప్రాంతాలకు తరలించాలన్నారు.

గత ప్రభుత్వాలు తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టాయన్నారు. ఎన్ని నిధులు ఖర్చయినా సరే శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. వరద పరిస్థితులపై భవిష్యత్‌ అవసరాలకు ఉపయోగపడే విధంగా నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యేకంగా బుక్‌ను తయారు చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథ పైపులు చాలా ప్రాంతాల్లో దెబ్బతిన్నాయని, వాటికి తక్షణమే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్‌ డిపో ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులు కోరినందున దీన్ని వెంటనే మంజూరు చేస్తున్నామన్నారు. వరద తక్షణ సహాయం కింద ములుగు జిల్లాకు రూ.2.50కోట్లు, భద్రాచలం జిల్లాకు రూ.2.30కోట్లు, భూపాలపల్లి జిల్లాకు రూ.2కోట్లు, మహబూబాబాద్‌కు రూ.1.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వర్షాలతో వరద ముప్పు తొలగిపోయే వరకు ములుగులో హెలికాప్టర్‌, భద్రాచలంలో మరో హెలికాప్టర్‌ను సిద్ధంగా ఉంచుతామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పాత బ్రిడ్జిలు, కాజ్ వేలు, కల్వర్టులను వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు.

కరెంటు సౌకర్యాన్ని కూడా అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు. పక్కాపూర్ గ్రామ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. శ్యాంపల్లి ఆర్‌ అండ్‌బీ రోడ్డు పనులను సత్వరమే చేపట్టాలన్నారు. నిధులు ఎక్కువ ఖర్చయినా సరే.. నాణ్యమైన పనులు చేపట్టాలన్నారు. ఏజెన్సీ ఏరియాలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణమే పారిశుధ్య పనులను చేపట్టాలన్నారు. మనందరం ప్రజల కోసమే పనిచేయాలన్నారు. అటవీశాఖ అధికారులు పనుల ఇబ్బందుల పేరుతో ఏమాత్రం ఇబ్బంది పెట్టొద్దని సీఎం స్పష్టం చేశారు.

- Advertisement -